ప్రధానిని క్షమాపణ కోరిన అంకిత్ లవ్ కు ఎమర్జెన్సీ వీసా మంజూరు !

Telugu Lo Computer
0


జమ్మూ కాశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ వ్యవస్థాపకుడు భీమ్ సింగ్ కుమారుడు అంకిత్ లవ్ ను ప్రభుత్వ బ్లాక్ లిస్టు నుంచి తొలగించింది. గతేడాది లండన్‌లో ప్రభుత్వ వ్యతిరేక చర్యల్లో పాల్గొన్నందుకు అంకిత్ ను భారత ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ చేసింది. ఇదిలా ఉంటే ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో ఉంటున్న ఆయన తల్లి చనిపోయింది. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఎమర్జెన్సీ వీసా కోసం ప్రధాని నరేంద్ర మోడీని క్షమాపణలు కోరతూ లేఖ రాశాడు. దీంతో ఆయనకు కేంద్ర వీసా మంజూరు చేసింది. ప్రస్తుతం లండన్ లో ఉన్న అంకిత్ లవ్ తన తల్లి జయమాల అంత్యక్రియలకు హాజరయ్యేందుకు గురువారం మూడు నెలల అత్యవసర వీసాను అందించింది. శుక్రవారం మధ్యాహ్నం ఉదంపూర్ జిల్లాలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. నా తల్లికి తుది వీడ్కోలు చెప్పేందుకు శుక్రవారం ఉదయం జమ్మూ వస్తున్నానని అంకిత్ లవ్ వెల్లడించారు. తన క్షమాపణలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నందుకు, తల్లి అంత్యక్రియలు నిర్వహించడానికి వీసా అందించింనందుకు సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. భారత ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. గతేడాది లండన్ లో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్నాడు అంకిత్ లవ్. హైకమిషన్ కార్యాలయంపైకి గుడ్లు, రాళ్లతో దాడి చేశాడు. దీంతో అతడిని భారత హైకమిషన్ బ్లాక్ లిస్టులో చేర్చింది. నేను ఎంతో ఇష్టపడే, గర్వపడే నా దేశానికి వ్యతిరేకంగా ఇకమీదట మరోసారి అలాంటి చర్యలకు పాల్పడనని క్షమాపణలు కోరారు. ఈ నేపథ్యంలో ఆయన క్షమాపణలు కోరడంతో వీసా మంజూరైంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన జయమాల ఏప్రిల్ 26న మరణించారు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని జమ్మూలోని ప్రభుత్వ వైద్యశాలలోని మార్చురీలో ఉంచారు. గతేడాది మే 31న ఆయన తండ్రి భీమ్ సింగ్ మరణించారు. ఆ సమయంలో అంకిత్ లవ్ తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేదు. 

Post a Comment

0Comments

Post a Comment (0)