26 మంది చిన్నారులను కాపాడిన అధికారులు

Telugu Lo Computer
0


వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న పిల్లలను రైల్వే అధికారులు కాపాడారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మైనర్ల అక్రమ రవాణాను అడ్డుకుని 8మంది ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రైల్వే పోలీస్, చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్, భేటీ బచావో ఆందోళన్ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ లో మొత్తం 26 మంది చిన్నారులను కాపాడారు. ఈ మేరకు రాష్ట్ర మహిళా భద్రత విభాగం అదనపు డీజీ శిఖాగోయల్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌ రాష్ట్రాలకు చెందిన 13 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సున్న పిల్లలను ఈస్ట్‌ కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ నుంచి సికింద్రాబాద్‌కు తరలిస్తున్నట్టు సమాచారం అందింది. వీరందరినీ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో పనిచేయించేందుకు తీసుకువస్తున్నట్టు నిర్ధారణ అయింది. దీంతో స్వచ్ఛంద సంస్థతో కలిసి అధికారులు పిల్లలను రక్షించేందుకు ఆపరేషన్‌ నిర్వహించారు. అనంతరం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో మాటు వేసిన పోలీసులు మొత్తం ఎనిమిది మంది ముఠా సభ్యులను అరెస్టు చేసి పిల్లలను రక్షించారు. వీరిపై ఐపీసీ సెక్షన్‌ 374, 341ల కింద సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితులు పశ్చిమ బెంగాల్‌కు చెందిన రంజాన్‌ మోల్లా, షేక్‌ సైదులు, ప్రియారుల్‌ షేక్, జాకీర్‌ అలీ, సురోజిత్‌ సంత్రా, జార్ఖండ్‌కు చెందిన పింటుదాస్, హైదరాబాద్‌ చార్మినార్‌ ప్రాంతానికి చెందిన సుసేన్‌ తుడు, అబ్దుల్‌ అల్మాని మోండేల్‌గా గుర్తించారు. నిందితుల నుంచి కాపాడిన 26 మంది పిల్లలను సైదాబాద్‌లోని ప్రభుత్వ హోమ్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. రైల్వే పోలీస్, చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్, భేటీ బచావో ఆందోళన్ స్వచ్ఛంద సంస్థ జాయింట్ ఆపరేషన్ నిర్వహించి పిల్లల అక్రమ రవాణా ముఠా సభ్యులను పట్టుకున్న సిబ్బందిని అడిషనల్ డీజీ శిఖాగోయల్‌ అభినందించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)