గంగా పుష్కరాలకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. అలహాబాద్, గంగోత్రి, గంగాసాగర్, హరిద్వార్, బద్రీనాథ్, కేదార్నాథ్, సంగం ప్రయాగ, వారణాసిల్లో ప్రత్యేక ఘాట్లు ఏర్పాటు చేసింది. టెంట్ సిటీ ఏర్పాటు చేసి యాత్రికుల కోసం ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పిస్తోంది ప్రభుత్వం. పరమ పవిత్రమైన గంగా పుష్కరాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది యాత్రికులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది ప్రభుత్వం. గత పుష్కరాలు సందర్భంగా చోటుచేసుకున్న తప్పిదాలు పునరావృతం కాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. గంగా పుష్కరాలకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో యాత్రికులు వెళ్లే అవకాశం ఉండటంతో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. హైదరాబాద్, విశాఖ, తిరుపతి, గుంటూరు నుంచి రైల్వే ప్రత్యేక సర్వీసులు నడుపుతుంది. విశాఖపట్నం నుంచి 11, హైదరాబాద్, తిరుపతి నుంచి 18 ప్రత్యేక రైళ్లను వేసినట్లు ప్రకటించింది రైల్వే. ఈ ప్రత్యేక రైళ్లు కాకుండా ఐఆర్సీటీసీ ద్వారా గౌరవ్ రైల్ సర్వీసు కూడా ప్రవేశపెట్టింది. ఎండ్ టూ ఎండ్ పద్ధతిలో గంగా పుష్కరాలతోపాటు మధ్యలో మరికొన్ని పుణ్యక్షేత్రాల దర్శనం చేసేలా ఐఆర్సీటీసీ టూర్ ప్లాన్ చేసింది. 12 ఏళ్ల తర్వాత జరుగుతున్న పుష్కరాలకు దక్షిణ భారత్ నుంచి మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తెలుగు వారికి భాషా పరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకునే విషయమై జిల్లా మేజిస్ట్రేట్ రాజలింగం వారణాసిలో స్థిరపడిన కొందరితో సమావేశం నిర్వహించి, యాత్రికులకు ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు. రద్దీ ఎక్కువ ఉన్నట్లయితే, పాఠశాలలు, షెల్టర్ హోమ్లు, ఆశ్రమాలలో యాత్రికులు బస చేయడానికి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా గంగా, కాశీ విశ్వనాథ ధామ్ ఇతర ప్రముఖ ధార్మిక క్షేత్రాల వెంబడి ఘాట్లకు చేరుకోవడానికి నగరంలో యాత్రికుల తరలింపు కోసం బస్సులు, ఇ-రిక్షాలు, ఇతర ప్రజా రవాణా ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ప్రకటనల కోసం తెలుగు, తమిళం మాట్లాడే వ్యక్తులను ప్రత్యేకంగా నియమిస్తున్నారు. 2011లో చివరి గంగా పుష్కరాలు జరిగినప్పుడు నగరంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంతో ట్రాఫిక్ సమస్యతోపాటు వసతి సమస్య తలెత్తింది. ఈ సారి ఆ సమస్య రాకుండా ఉండేందుకు అందుబాటులో ఉన్న అన్ని భవనాలను వాడుకోవాలని నిర్ణయించారు. అంతేకాకుండా కాశీ విశ్వనాథ ఆలయం పక్కన ప్రత్యేకంగా టెంట్ సిటీ నిర్మించారు. 100 హెక్టార్లలో ఏర్పాటు చేసిన ఈ టెంట్ సిటీ ద్వారా భక్తులకు మెరుగైన వసతి లభిస్తుందని చెబుతున్నారు. భక్తులు ఎంత భారీగా తరలివచ్చినా వసతికి ఇబ్బంది లేకుండా టెంట్లతో నివాస కుటీరాలను నిర్మించారు. కాటేజీ లభించలేదన్న చింత లేకుండా ఈ టెంట్ హౌస్లో బస ఏర్పాట్లు ఉన్నాయి. ఈ టెంట్ సిటీలో ఒకే విడత 200 మందికి విడిది చేసేలా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. గంగా దర్శన్ విల్లాస్, ప్రీమియం టెంట్స్, సూపర్ డీలక్స్ టెంట్స్ అనే మూడు విభాగాలు ఉన్నాయి. గంగా విల్లాలో 900 చదరపు అడుగులు, కాశీ సూట్స్లో 576 చదరపు అడుగులు, సూపర్ డీలక్స్లో 480 నుంచి 580 చదరపు అడుగులు, డీలక్స్లో 250 నుంచి 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో వసతి ఉంటుంది. ఫ్రిజ్, టీవీ, గీజర్, రూమ్ హీటర్ అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
గంగా పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు !
April 21, 2023
0
Tags