రామనవమి వేడుకల సందర్భంగా బీహార్లో చెలరేగిన హింసాకాండ నేపధ్యంలో బీజేపీ, ఆర్జేడీ పరస్పర విమర్శలతో ఉద్రిక్త వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. బీహార్లో మత ఘర్షణలపై ఆదివారం ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గవర్నర్ రాజేంద్ర విశ్వనాధ్ అర్లేకర్తో మంతనాలు జరుపుతూ పరిస్ధితిని సమీక్షించారు. ఇక అమిత్ షా తీరును ఆర్జేడీ ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ తప్పుపట్టారు. అమిత్ షా ఆరాటం బీహార్ కోసం కాదని, రాష్ట్రంలోని 40 లోక్సభ స్ధానాల గురించే ఆయన కలత చెందుతున్నారని తివారీ చురకలంటించారు. ఈడీ, సీబీఐతో మీరు సంతృప్తిగా ఉంటే బీహార్కు భద్రతా బలగాలు పంపించాలని ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. అమిత్ షా బీహార్ గురించి ఆందోళన చెందడం లేదని, ఆయన బాధంతా 40 లోక్సభ స్ధానాలపైనే అని తివారీ వ్యాఖ్యానించారు. బీహార్లో శాంతి భద్రతల సమస్యను సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి సూర్య పర్యవేక్షిస్తారని, కేంద్ర హోంమంత్రి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చెలరేగిన హింసాకాండపై దృష్టి సారించాలని ఆర్జేడీ నేత హితవు పలికారు. రామనవమి వేడుకల్లో హింసాకాండపై సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేయాలని బీజేపీ సీనియర్ నేత గిరిరాజ్ సింగ్ డిమాండ్ చేశారు. నితీష్జీ మీరు హిందువులు నలందను విడిచివెళ్లాలని కోరుతున్నారు. మీరు ముస్లింలకే కాదు, హిందువులకు కూడా సీఎం అని గుర్తుపెట్టుకోవాలని బీహార్ సీఎంను ఉద్దేశించి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు.
అమిత్ షా ఆరాటం లోక్సభ స్ధానాల కోసమే !
April 02, 2023
0
Tags