సావర్కర్‌ ను కించపరిచేలా మాట్లాడటం సరికాదు !

Telugu Lo Computer
0


సావర్కర్‌ ను కించపరిచేలా మాట్లాడటం సరికాదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే హెచ్చరించారు. రాహుల్‌పై లోక్‌సభ సెక్రటేరియట్‌ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై రాహుల్‌ మీడియాతో మాట్లాడుతూ.. 'నా పేరు సావర్కర్‌  కాదు.. గాంధీ..! క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది' అంటూ వ్యాఖ్యానించారు. రాహుల్‌ వ్యాఖ్యలపై తాజాగా ఉద్ధవ్‌ స్పందించారు. సావర్కర్‌ను కించపరిచేలా మాట్లాడటం సరికాదని అన్నారు. 'హిందుత్వ సిద్ధాంతాల విషయంలో సావర్కర్ మాకు స్ఫూర్తి. ఆయన్ని మేము ఆరాధ్య దైవంగా భావిస్తున్నాం. సావర్కర్‌ని అవమానించకండి. సావర్కర్ 14 ఏళ్ల పాటు అండమాన్ సెల్యులర్ జైల్లో ఊహకందని చిత్రహింసలను అనుభవించాడు. అది త్యాగానికి ప్రతిరూపం. అలాంటి సావర్కర్‌ను అవమానిస్తే మేం భరించలేము. సావర్కర్ విషయంలో పోరాటం చేయడానికి అయినా మేం సిద్ధం. ఆయన గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే విపక్ష కూటమిలో చీలికలు వచ్చే ప్రమాదం ఉంది' అని ఠాక్రే హెచ్చరించారు. 'నేను రాహుల్‌ గాంధీకి ఒకటి చెప్పాలనుకుంటున్నా. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే మేము కాంగ్రెస్, ఎన్సీపీల కూటమితో జత కట్టాము. ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. చీలికలు సృష్టించే ఎటువంటి ప్రకటనలు, వ్యాఖ్యలు చేయొద్దు. బీజేపీ ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి విషయాల గురించి ఆలోచించి సమయాన్ని వృథా చేసుకోవద్దు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే విషయంలో కలిసి పోరాడాల్సి ఉంది. మనం ఈ సమయాన్ని కోల్పోతే.. మన దేశం ఖచ్చితంగా నిరంకుశత్వం వైపు వెళ్తుంది' అని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)