జర్నలిస్టుల రక్షణ కోసం 'ఛత్తీస్గఢ్ మీడియా పర్సన్స్ ప్రొటెక్షన్ బిల్లు 2023 'ను ప్రవేశపెట్టింది. బుధవారం అసెంబ్లీలో ఈ బిల్లుని ఆమోదించారు. ఇది చారిత్రాత్మక రోజు అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ అభివర్ణించారు. మీడియా ప్రతినిధులపై హింసను నిరోధించడం, విధులు నిర్వర్తించడంలో ఈ బిల్లు రక్షణ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ చట్టాన్ని అమలు చేయాలని పలుమార్లు డిమాండ్ వచ్చిందని, దీనికి సంబంధించి 2019లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అఫ్తాబ్ ఆలం నేతృత్వంలో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారని సిఎం అన్నారు. ఈ చట్టం అందరిని సంప్రదించి చేశామని స్పష్టం చేశారు. అయితే ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్ష బిజెపి ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, రాష్ట్రంలోని ప్రెస్ క్లబ్లతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపిందా అని ప్రతిపక్ష నేత నారాయణ్ చందేల్, అజరు చంద్రాకర్ సహా పలువురు బిజెపి ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. బిజెపి సభ్యుల డిమాండ్ను స్పీకర్ చరదాస్ మహంత్ తిరస్కరించారు. ఛత్తీస్గఢ్లో 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో రాష్ట్రంలోని జర్నలిస్టులకు రక్షణ కల్పించే చట్టాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. జర్నలిస్టుల ప్రయోజనాలకు బిజెపి వ్యతిరేకమని, బిల్లును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ బిల్లు ప్రకారం ఓ వ్యక్తి జర్నలిజంలో కనీసం 10 ఏళ్ల అనుభవం ఉండాలి. ప్రస్తుత సంఘటనపై మీడియా సంస్థలో కనీసం 6 కథనాలను ప్రచురించాలి లేదా కనీసం మూడు నెలల జీతాన్ని సదరు మీడియా సంస్థ నుంచి పొందాలి. మీడియా పర్సన్ అంటే ఎడిటర్, రైటర్, న్యూస్ ఎడిటర్, డిప్యూటీ ఎడిటర్, ఫీచర్ రైటర్, కరస్పాండెంట్, కాపీ ఎడిటర్, కమ్యూనికేటర్, కార్టూనిస్ట్, న్యూస్ ఫోటోగ్రాఫర్, వీడియో జర్నలిస్ట్, ట్రాన్స్లేటర్, ట్రైన్ జర్నలిస్టులుగా బిల్లులో పేర్కొన్నారు. చట్టం అమలులోకి వచ్చిన 90 రోజుల్లోపు 'ఛత్తీస్గఢ్ మీడియా ఫ్రీడమ్, ప్రొటెక్షన్ అండ్ ప్రమోషన్ కమిటీ'ని ఏర్పాటు చేయనుంది. ఇది మీడియా పర్సన్స్ వ్యక్తిగత నమోదుకు పనిచేస్తుంది. మీడియా వ్యక్తులపై వేధింపులు, బెదిరింపులు, హింస లేదా తప్పుడు ఆరోపణలు మరియు అరెస్టు వంటి వాటికి సంబంధించిన ఫిర్యాదులను కమిటీ పరిష్కరిస్తుంది. ఈ కమిటీలో ప్రభుత్వంలో సెక్రటరీ స్థాయి రిటైర్డ్ అడ్మినిస్ట్రేటర్/ పోలీస్ అధికారి ఉంటారు. హోం డిపార్ట్మెంట్ నామినేట్ చేసిన ప్రాసిక్యూషన్ బ్రాంచ్ అధికారితో పాటు ముగ్గురు మీడియా వ్యక్తులు ఉంటారని, ఓ మహిళా కూడా ఉంటారు. ఒక ప్రైవేట్ వ్యక్తి హింసకు, వేధింపులకు లేదా మీడియా ప్రతినిధిని భయపెట్టడానికి కారణమైతే, కమిటీ, కేసును పరిశీలించి, ఇరుపక్షాల వాదనలను విన్న తర్వాత, నేరస్తుడిపై రూ. 25,000 జరిమానా విధించవచ్చు. ఏదైనా కంపెనీ మీడియా ప్రతినిధిని బెదిరింపులకు, హింసకు గురిచేసినా లేదా పరోక్షంగా హింసకు కారణమైనా కమిటీ కేసును పరిశీలించి, ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత రూ.10,000 జరిమానా విధించబడుతుంది. అర్హులైన మీడియా ప్రతినిధుల నమోదులో ఎవరైనా అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తే, సంబంధిత వ్యక్తికి రూ.25,000 జరిమానా విధించబడుతుంది.
జర్నలిస్టుల రక్షణ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఛత్తీస్గఢ్
March 23, 2023
0
Tags