తప్పు ఎవరు చేసినా వదిలిపెట్టేది లేదు !

Telugu Lo Computer
0


అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాఎట్టకేలకు పెదవి విప్పారు. ఇండియా టుడే కాంక్లేవ్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ, ఈ వివాదంపై సుప్రీంకోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు, రుజువులు ఉన్నవారు ఈ కమిటీకి సమర్పించాలని చెప్పారు. తప్పు ఎవరు చేసినా వదిలిపెట్టేది లేదన్నారు. న్యాయ వ్యవస్థ ప్రక్రియపై అందరికీ నమ్మకం ఉండాలన్నారు. నిరాధారమైన ఆరోపణలను చేయకూడదని, అవి ఎంతో కాలం నిలబడవని చెప్పారు. అదానీ వివాదంపై దర్యాప్తు జరుపుతున్నట్లు సెబీ అఫిడవిట్ ద్వారా సుప్రీంకోర్టుకు తెలిపిందన్నారు. ఈ దర్యాప్తును కొనసాగించాలని సెబీని సుప్రీంకోర్టు  ఆదేశించిందన్నారు. ఏక కాలంలో రెండు దర్యాప్తులు జరుగుతున్నాయన్నారు. అదానీ గ్రూప్‌పై దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆరుగురు నిపుణులతో ఓ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలో జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే, నందన్ నీలేకని, జస్టిస్ జే పీ దేవధర్, సోమశేఖర్ సుందరేశన్, ఓం ప్రకాశ్ భట్, కేవీ కామత్ ఉన్నారు. అదానీ గ్రూప్ స్టాక్ మానిపులేషన్ తదితర అక్రమాలకు పాల్పడిందని అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో అదానీ గ్రూప్ సంపద పెద్ద ఎత్తున ఆవిరి అయిపోయింది. దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ చేత దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్, తదితర విపక్షాలు పార్లమెంటులో డిమాండ్ చేస్తున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)