ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు నగర పరిధిలోని పేర్నమిట్టకు చెందిన ఢాకా అంజిరెడ్డి (45), పూర్ణిమ (40) దంపతులు ఒంగోలు నగరంలోని విరాట్నగర్లో నివాసముంటున్నారు. అంజిరెడ్డి ఆటోడ్రైవర్గా, పూర్ణిమ డ్వాక్రా గ్రూపుల యానిమేటర్గా పనిచేస్తున్నారు. వీరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో గత కొన్నాళ్లుగా తరచూ గొడవ పడుతున్నారు. సోమవారం రాత్రి కూడా ఘర్షణ పడ్డారు. ఈ సమయంలో తీవ్ర ఆగ్రహానికి గురైన అంజిరెడ్డి వంట గదిలోని చపాతీ కర్రతో పూర్ణిమపై విచక్షణారహితంగా దాడి చేశారు. తలకు తీవ్ర గాయాలై రక్తపుమడుగులో ఆమె కుప్పకూలిపోయింది. అనంతరం అంజిరెడ్డి ద్విచక్ర వాహనంపై బయటికి వెళ్లారు. విషయం తెలుసుకున్న పూర్ణిమ తండ్రి సుబ్బరామిరెడ్డి ఒంగోలులోని తన సోదరుడి కుమారుడు ఆదినారాయణరెడ్డికి ఫోన్ చేసి సమాచారం తెలిపారు. ఆయన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పూర్ణిమను నగరంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి జీజీహెచ్కు తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. దాడి అనంతరం ఆందోళనకు గురైన అంజిరెడ్డి ద్విచక్ర వాహనంపై కొత్తపట్నం సముద్రతీరానికి వెళ్లి అక్కడ సముద్రంలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అతని మృతదేహం మంగళవారం ఉదయం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. అంజిరెడ్డి, పూర్ణిమ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ఇంజినీరింగ్ పూర్తిచేసి ఎంఎస్ చేసేందుకు విదేశాలకు వెళ్లే సన్నాహాల్లో ఉంది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. రెండో కుమార్తె గుంటూరు సమీపంలోని ఓ ప్రముఖ యూనివర్శిటీలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. అంజిరెడ్డి గతంలో ఒంగోలుకు చెందిన ఓ ఆడిటర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. ఆ తర్వాత న్యాయస్థానం ఆ కేసును కొట్టేసింది. అంజిరెడ్డి సోదరుడు హనుమారెడ్డి భార్య సుజాత వైకాపా నుంచి 34వ డివిజన్ కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. భార్యాభర్తలిద్దరూ కష్టపడి పనిచేసుకుంటూ పిల్లల్ని ఉన్నత చదువులు చదివిస్తున్నారు. మరో రెండేళ్లు అయితే వారిద్దరు జీవితాల్లో స్థిరపడేవారు. ఇంతలో అనూహ్యంగా వారి భవిష్యత్తు అంధకారమైంది. విషయం తెలియగానే కుమార్తెలిద్దరూ ఒంగోలు చేరుకున్నారు. తల్లిదండ్రుల మృతదేహాల వద్ద గుండెలవిసేలా రోదించారు. వారిని ఓదార్చటం ఎవరితరం కాలేదు.
క్షణికావేశంతో భార్యని చంపి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు !
March 29, 2023
0
Tags