తైవాన్కు చెందిన ఎవర్గ్రీన్ అనే షిప్పింగ్ సంస్థ తమ ఉద్యోగులకు ఇయర్ ఎండ్ బోనస్ కింద ఇప్పటికే 50 నెలల జీతాన్ని బోనస్గా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మరో 10 నుంచి 11 నెలల వేతనాన్ని మిడ్ ఇయర్ బోనస్ కింద చెల్లించాలని నిర్ణయించింది. అంటే దాదాపు 5 ఏళ్ల జీతాన్ని ఆ సంస్థ ఉద్యోగులు బోనస్గా అందుకోనున్నారు. కేవలం మిడ్ ఇయర్ బోనస్ కింద దాదాపు 94 మిలియన్ డాలర్లు మేర చెల్లించే అవకాశం ఉన్నట్టు అక్కడి వార్తా సంస్థ వెల్లడించింది. కరోనా మహమ్మారి సమయంలో సూయిజ్ కెనాల్లో ఓ భారీ నౌక చిక్కుకుపోయి కొన్ని రోజుల పాటు ఆ మార్గంలో రవాణాకు తీవ్ర అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. అది ఎవర్గ్రీన్ సంస్థకు చెందినదే. ఈ షిప్పింగ్ సంస్థ కరోనా కాలంలో భారీ నష్టాలను కూడా చవి చూసింది. అయితే, ఆ తర్వాత పరిస్థితులు సద్దుమణగడం, ప్రపంచవాప్తంగా లాక్డౌన్ను ఎత్తివేయడంతో గత రెండేళ్లుగా 39.92 శాతం మేర లాభాలను ఆర్జిస్తోంది. ఉద్యోగుల కృషిఫలితంగానే ఇంత భారీగా లాభాలు వచ్చాయని భావించని ఆ సంస్థ.. ఉద్యోగుల వ్యక్తిగత పనితీరు ఆధారంగా బోనస్కు ఎంపిక చేసింది. ఈ ఏడాది మధ్యలో వారి ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమచేస్తామని ఎవర్గ్రీన్ పేర్కొన్నట్లు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. తైవాన్లో ఆర్థిక సంవత్సరం డిసెంబరు 31తో ముగుస్తుంది. అయితే, తాజాగా డిసెంబరు 31, 2022 నాటికి ఎవర్గ్రీన్ రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జించింది. NT334 బిలియన్ డాలర్లతో గతంలో ఎన్నడూ లేనంతగా లాభాలు సాధించింది. ఇంతటి విజయానికి ఉద్యోగులే కారణమని భావించిన ఎవర్గ్రీన్.. తమ సంస్థలో పని చేస్తున్న 3,100 మంది ఉద్యోగులందరికీ బోనస్ ప్రకటించింది. ఈ సంస్థలో పని చేసే ఉద్యోగుల వార్షిక వేతనం దాదాపు 29,545 డాలర్ల నుంచి.. 1,14,823 డాలర్ల వరకు ఉంటుంది. ఈ లెక్కన ఐదేళ్ల బోనస్ అంటే వాళ్లకి సగటున ఎంత వస్తుందో అంచనా వేయొచ్చు. ఎవర్గ్రీన్ ఉద్యోగులకు 5 సంవత్సరాల జీతాన్ని బోనస్గా ప్రకటించారన్న వార్తలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాపించాయి. దీంతో ఆ సంస్థ ఉద్యోగులను చూస్తే అసూయ కలుగుతోందంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.
ఐదేళ్ల జీతం బోనస్గా ప్రకటించిన ఎవర్గ్రీన్ అనే షిప్పింగ్ సంస్థ !
March 22, 2023
0
Tags