ప్రజాస్వామ్యానికి నకిలీ వార్తలు ప్రమాదకరం !

Telugu Lo Computer
0


ఢిల్లీలో జరిగిన రామ్‌నాథ్‌ గోయెంకా 16వ అవార్డుల ప్రదానోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బాధ్యతాయుతమైన జర్నలిజం దేశ ప్రజాస్వామ్యాన్ని మెరుగైన దిశగా నడిపించే ఇంజిన్‌ అని అభిప్రాయపడ్డారు. నేటి డిజిటల్‌ యుగంలో జర్నలిస్టులు తమ రిపోర్టింగ్‌లో కచ్చితంగా, నిష్పాక్షికత, బాధ్యతాయుతంగా, భయం లేకుండా ఉండటం ముఖ్యమని అన్నారు. ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లాలి అంటే మీడియా స్వేచ్ఛ ముఖ్యమని సీజేఐ చంద్రచూడ్‌ అభిప్రాయపడ్డారు. కత్తి కంటే కలం గొప్పదనే విషయాన్ని యావత్తు లోకం విశ్వసిస్తుందని అన్నారు. పలు సందర్భాల్లో సామాజిక, రాజకీయ మార్పుల్లో కీలక పాత్ర పోషించిన చరిత్ర వార్తాపత్రికలకు ఉన్నదని పేర్కొన్నారు. ఒక్క నకిలీ వార్త తీవ్రమైన విధ్వంసానికి దారితీసే ప్రమాదం ఉన్నదని, ఈ నేపథ్యంలో వాస్తవాలను పరిశీలించే సమగ్రమైన వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో 'మీడియా ట్రయల్స్‌’పై కూడా సీజేఐ మాట్లాడారు. ఇంకా కోర్టులు కూడా కేసు విచారణ పూర్తి చేయకుండానే.. మీడియా ఒక నిందితుడిని ప్రజల దృష్టిలో దోషిగా చూపిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. అమాయకుల హక్కులను ఉల్లంఘించకుండా ప్రజలకు సమాచారం అందించడం మీడియా బాధ్యతని సూచించారు. ఇందిరా గాంధీ హయాంలో విధించిన అత్యవసర పరిస్థితి అంశాన్ని కూడా సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఆ సమయంలో ఇంగ్లిష్‌ పత్రిక 'ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ తన ఎడిట్‌ పేజీలను ఖాళీగా ప్రచురించిందని.. నిశ్శబ్దం ఎంత శక్తివంతమైందో చూపిందనే దానికి అది నిదర్శమని అన్నారు. 'అది భయంకరమైన సమయం. భయం లేని సమయం కూడా.. ఆ సమయం నిర్భయమైన జర్నలిజానికి దారితీసింది' అని ఆనాటి పరిస్థితుల గురించి వ్యాఖ్యానించారు. నిజం, అబద్ధం మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉన్నదని సీజేఐ చంద్రచూడ్‌ నొక్కి చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)