క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఢిల్లీలో కాసేపు సందడి చేశారు. ఆటోలో ప్రయాణిస్తూ ప్రజలకు అభివాదం చేశారు. అంతేకాకుండా అక్కడున్న చిన్నారులతో సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన ట్విటర్లో పోస్టు చేశారు. అమెరికా-భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న భారత్లోని కాన్సులేట్లను ఆయన అభినందించారు. ''భారత్లోని యూఎస్ఏ ఎంబసీతో పాటు, హైదరాబాద్, కోల్కతా, చెన్నై, ముంబయి కాన్సులేట్లో విధులు నిర్వర్తిస్తున్న అధికారులందరినీ ప్రత్యక్షంగా కలవడం ఎంతో ఆనందగా ఉంది. భారత్- అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు వారు చేస్తున్న కృషి, పట్టుదలకు కృతజ్ఞతలు'' అంటూ ఆయన ట్విటర్లో రాసుకొచ్చారు. అమెరికా-భారత్ మధ్య సంబంధాలు ఎంత దృఢంగా ఉన్నాయో చెప్పేందుకు తన పర్యటనే ఓ ఉదాహరణ అని ఆంటోని బ్లింకెన్ అన్నారు. ఇండో-పసిఫిక్ రీజియన్ను రక్షించడంలో ఇరుదేశాల నిబద్ధతకు తన పర్యటన అద్దంపడుతోందని అన్నారు. ప్రతిష్ఠాత్మకమైన జీ20 సదస్సుకు అధ్యక్ష హోదాలో అతిథ్యం ఇస్తున్న భారత్కు ఆయన అభినందించారు. ఇండో-ఫసిపిక్ ప్రాంతంలో చైనా దూకుడును సమీక్షించేందుకు దిల్లీలో ఇవాళ క్వాడ్ విదేశాంగ మంత్రులు సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో భారత్ విదేశాంగశాఖ మంత్రి జై శంకర్తోపాటు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా విదేశాంగశాఖ మంత్రులు ఆంటోనీ బ్లింకెన్, యోషిమాషా హయాషి, పెన్నీ వాంగ్ పాల్గొన్నారు. చైనాను కట్టడి చేసేందుకు అమలు చేయాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం.
ఆటోలో ఆంటోనీ బ్లింకెన్ సందడి !
March 04, 2023
0
Tags