గుజరాత్లోని భావ్నగర్, రాజ్కోట్, సురేంద్ర నగర్ జిల్లాలు ఉల్లి పంటకు పెట్టింది పేరు. రాష్ట్రంలో ఈ ఏడాది 99,413 హెక్టార్లలో ఉల్లిని పండించారు. ఇబ్బడి ముబ్బడిగా దిగుబడి పెరగటంతో ఈసారి ఉల్లి ధర పడిపోయి కిలో రూ.5-7 మధ్య పలుకుతున్నది. గుజరాత్లో ఉల్లి మార్కెట్ అయిన మహువా వ్యవసాయ మార్కెట్లోఉల్లికి మద్దతు ధర లభించడం లేదు. 20 కిలోల ఉల్లి పండించడానికి రైతుకు రూ.220 ఖర్చయితే మార్కెట్ రేటు ప్రకారం అతడికి రూ.150 మాత్రమే లభిస్తున్నదని మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ఘన్శ్యామ్ భాయి పటేల్ చెప్పారు. ఈ లెక్క ప్రకారం హెక్టారుకు 25 టన్నుల ఉల్లి దిగుబడి వస్తే రైతు ఎకరాకు రూ.50 వేలు నష్ట పోతున్నాడని వివరించారు. ఉల్లి రైతులను ఆదుకోవాలని, పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యేలు రెండు రోజుల క్రితం సీఎం భూపేంద్ర పటేల్కు విజ్ఞప్తి చేశారు. కానీ సీఎం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికే గత ఏడాది గుజరాత్ ప్రభుత్వం ఉల్లి రైతులను ఆదుకోవటానికి రూ.100 కోట్లు ప్రకటించిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఉల్లి రైతుల కష్టాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఆదుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. వెంటనే ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించి, రైతులకు ఇన్పుట్ సబ్సిడీలను ప్రకటించాలని కోరింది. కేంద్ర ప్రభుత్వం రైల్వే ద్వారా రవాణా సౌకర్యం కల్పిస్తే పంజాబ్, ఢిల్లీ ప్రభుత్వాలు నేరుగా గుజరాత్ రైతుల నుంచి ఉల్లి పంటను కొనుగోలు చేస్తాయని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తనను కలిసిన రైతు నాయకులకు హామీ ఇచ్చారు.
ఉల్లి రైతు కంట కన్నీరు !
March 03, 2023
0
Tags