తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సులో డ్యూటీలో ఉన్న కండక్టర్ గార్లపాటి మహేందర్ రెడ్డి (55) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్యంగా ఉండటంతో మార్చి 9 నుంచి 12వ తేదీ వరకు మహేందర్ సెలవులో ఉన్నారు. ఆదివారం వరకు సెలవు ఉన్నా నిన్న ఉదయం 11 గంటలకు డిపోకు వచ్చిన మహేందర్ డ్యూటీ వేయించుకున్నాడు. అయితే, అప్పట్నుంచి ఆయన కనిపించకుండా పోయాడు. సిబ్బంది ఫోన్ చేసినా స్పందించలేదు. చివరకు డిపో ఆవరణలో పార్కింగ్ చేసి ఉన్న ఓ బస్సులో తన టవల్తో ఉరివేసుకుని విగత జీవిగా కనిపించాడు. ఆర్టీసీ సిబ్బంది వెంటనే అధికారులకు ఈ ఘటనపై సమాచారం ఇచ్చారు. అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతదేహాన్ని కిందికి దింపి పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య అరుణ, కుమారులు విక్రమ్, వినయ్లు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మహేందర్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బస్సులోనే ఉరివేసుకున్న కండక్టర్
March 13, 2023
0
Tags