రికార్డు స్థాయిలో రూ. 9.62 కోట్ల జరిమానా వసూలు

Telugu Lo Computer
0


దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో రూ. 9.62 కోట్ల జరిమానాను ప్రయాణికుల నుంచి వసూలు చేసింది. తొమ్మిది మంది టిక్కెట్ తనిఖీ సిబ్బంది రికార్డు స్థాయిలో ఈ జరిమానాను వసూలు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రైళ్లలో అనధికారిక ప్రయాణాన్ని అరికట్టడానికి, అధికారిక టికెట్ తో ప్రయాణించే రైలు ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించే దిశలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే నిరంతరం విస్తృతంగా టికెట్ తనిఖీలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా టిక్కెట్ తనిఖీ సిబ్బంది నిర్విరామ కృషి ఫలితంగా జోన్‌లో టిక్కెట్ల అమ్మకాల పెంపు మెరుగుపడిందని అధికారులు తెలిపారు. రైళ్లలో టిక్కెట్ లేకుండా ప్రయాణించడం, అనధికారిక ప్రయాణం, పరిమితికి మించిన లగేజీని బుక్ చేయకుండా ప్రయాణించే ప్రయాణికుల నుంచి దక్షిణ మధ్య రైల్వే కు చెందిన ఈ తొమ్మిది మంది టిక్కెట్ తనిఖీ సిబ్బంది రికార్డు స్థాయిలో జరిమానాను వసూలు చేసి చరిత్ర సృష్టించారని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. తొమ్మిది మంది టికెట్ తనిఖీ సిబ్బంది వివిధ రైళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి 1.16 లక్షల అనధికారిక ప్రయాణికుల నుంచి ఏకంగా రూ. 9.62 కోట్లు వసూలు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-,23లో తొమ్మిది మంది టిక్కెట్ తనిఖీ సిబ్బంది ఎంతో అంకితభావంతో విధులు నిర్వర్తించడం ద్వారా విజయాన్ని సాధించి ఒక కోటి కోటి వసూలు చేసిన 'వన్ క్రోర్ క్లబ్ ' లో స్థానం సంపాదించారు. వ్యక్తిగతంగా ఒక్కో టికెట్ తనిఖీ సిబ్బంది, అనధికారిక ప్రయాణికుల నుంచి జరిమానా రూపంలో కోటి రూపాయల ఆదాయం రాబట్టడం దక్షిణ మధ్య రైల్వే చరిత్రలోనే ఇదే తొలిసారి అని అధికారులు పేర్కొన్నారు. ఈ విధులు నిర్వహించిన టికెట్ తనిఖీ సిబ్బందిలో సికింద్రాబాద్ డివిజన్ నుంచి ఏడుగురు, గుంతకల్, విజయవాడ డివిజన్ల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. సీనియర్ డిసిఎం సికింద్రాబాద్ డివిజన్‌కు చెందిన చీఫ్ టిక్కెట్ ఇన్‌స్పెక్టర్ టి. నటరాజన్, టిక్కెట్ లేకుండా ప్రయాణించిన 12,689 మంది ప్రయాణికుల నుంచి, పరిమితికి మించిన లగేజీని అధికారికంగా బుక్ చేయకుండా తీసుకెళ్లడం వారి నుంచి అత్యధికంగా రూ 1.16 కోట్లు జరిమానాను వసూలు చేశారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, విధి నిర్వహణలో ఎంతో అంకితభావంతో ఆదర్శవంతమైన పని తీరును కనబర్చిన టికెట్ తనిఖీ సిబ్బందిని ప్రశంసించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)