జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను తిరిగి పునరుద్ధరించేంత వరకూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేది లేదని మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ అన్నారు. ఇది తన భావోద్వేగానికి సంబంధించిన అంశమని అన్నారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, అసెంబ్లీ సభ్యురాలిగా తాను ఉన్నప్పుడు రెండు రాజ్యాంగాల కింద రాష్ట్రం ఉండేదని, ఒకటి జమ్మూకశ్మీర్ రాజ్యాంగం, మరొకటి భారత రాజ్యంగమని, అదే సమయంలో రెండు జెండాలు ఉండేవని చెప్పారు. 370వ అధికరణను భారత ప్రభుత్వం పునరుద్ధరించేంత వరకూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని అన్నారు. ఈ విధంగా మాట్లాడటం తెలివితక్కువ తనమే కావచ్చని, అయితే తనకు మాత్రం ఇది భావోద్వేగానికి సంబంధించిన విషయమని చెప్పారు. 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై తానేమీ చెప్పలేనని అన్నారు. జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లా ఎల్ఓసీ సమీపంలో శారదా దేవి ఆలయం ప్రారంభాన్ని మెహబూబా ముఫ్తీ స్వాగతించారు. "ఇది చాలా మంచి విషయం. ప్రతి విషయాన్ని ఆత్మపరిశీలన చేసుకుని, సమస్యలేమైనా ఉంటే కలిసి కూర్చుని పరిష్కరించుకుంటూ ఉండాలి. శారదామాత ఆలయం ప్రారంభించడం మంచిదే. ఇందుకోసం కశ్మీర్ పండిట్లు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆలయం ప్రారంభం కావాలని వారు కోరుకుంటున్నారు'' అని మెహబూబా అన్నారు. ఎల్ఓసీ వెంబడి వాణిజ్య కార్యక్రమాలు తిరిగి ప్రారంభం కావాలని కూడా ఆమె అభిలషించారు.
370వ అధికరణ ను తిరిగి పునరుద్ధరించేంత వరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను !
March 22, 2023
0
Tags