జగన్ నోట 'వైనాట్ 175' మాట వినాలని ఉంది !

Telugu Lo Computer
0


పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ అభ్యర్థులకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభినందనలు తెలిపారు. అదే సందర్భంలో అధికార వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత వైసీపీని తొక్కిపట్టి నార తీశారన్నారు. ఈ ఫలితాలు రాష్ట్రానికి టీడీపీ పాలన ఎంత అవసరమో తెలియజేస్తున్నాయో స్పష్టం చేశాయన్నారు. ‘మూడు ఎమ్మెల్సీ స్ధానాల ఫలితాలతో పులివెందుల వైసీపీ కోటకు బీటలు పడుతున్నాయి. పులివెందుల కోటకు మొదలైన బీటలు త్వరలో తాడేపల్లి ప్యాలెస్ వరకు చేరుతాయి. ఇప్పుడు వైనాట్ 175 అని జగన్‌ అంటే వినాలని ఉంది’ అని సెటైర్లు వేశారు బాలయ్య. కాగా ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ మొత్తం మూడు స్థానాల్లో విజయ దుందుభి మోగించింది. ఇప్పటికే ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందగా, తాజాగా పశ్చిమ రాయలసీమ (కడప-అనంతపురము-కర్నూలు) నియోజకవర్గం ఫలితం ఈరోజు వెల్లడైంది. మూడు రోజుల పాటు అధికార, ప్రతిపక్ష పార్టీలకు ముచ్చెమటలు పట్టించిన.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో కూడా విజయం టీడీపీని వరించింది. రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డిపై 7, 543 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అంతకుముందు ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు భారీ విజయం సాధించారు. తూర్పు రాయలసీమ శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ గెలిచారు. మొత్తానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు టీడీపీ శ్రేణుల్లో జోష్‌ నింపాయి. పట్టభద్రుల 3 స్థానాలు టీడీపీ కైవసం చేసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్‌ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ‘ఈ ఫలితాలు.. ప్రజావిజయం, మార్పునకు సంకేతమని వ్యాఖ్యానించారు. పట్టభద్రుల తీర్పు.. మంచికి మార్గం, రాష్ట్రానికి శుభసూచకమన్నారు. తెదేపా అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వైకాపా అక్రమాలకు ఎదురొడ్డి నిలిచిన పార్టీ శ్రేణులకు సెల్యూట్‌ చేస్తున్నట్టు ట్వీట్‌ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)