ఢిల్లీ విమానాశ్రయంలో పవన్ ఖేరా అరెస్టు

Telugu Lo Computer
0


ఢిల్లీ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు వెళుతున్న కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరాను విమానం నుంచి కిందకు దింపివేసి అస్సాం పోలీసులు అరెస్టు చేయడంతో ఆయన వెంటే విమానంలో వెళుతున్న సుమారు 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. విమానం ముందు టర్మాక్ మీద వారు బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎఐసిసి ప్లీనరీ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు గురువారం ఛత్తీస్‌గఢ్‌కు బయల్దేరిన ఖేరా విమానంలోకి ప్రవేశించిన తర్వాత ఎఫ్‌ఐఆర్‌తో వచ్చిన అస్సాం పోలీసులు ఆయనను కిందకు దించివేసి అరెస్టు చేశారు. ఢిల్లీ కోర్టులో ఖేరాను ప్రవేశపెట్టిన తర్వాత ట్రాన్సిట్ రిమాండ్‌పై అస్సాంకు తరలిస్తారు. అదానీ, హిండెన్‌బర్గ్ వివాదంపై సంయుక్త పార్లమెంటరీ సంఘం (జెపిసి) వేయాలని ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో ఇటీవల డిమాండ్ చేసిన నేపథ్యంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి పవన్ ఖేరా ప్రధాని నరేంద్ర మోడీ పేరును తప్పుగా పలకడం వివాదాస్పదమైంది. పివి నరసింహారావు జెపిసి వేయగాలేంది, అటల్ బిహారీ వాజపేయి జెపిసి వేయగాలేంది నరేంద్ర గౌతమ్ దాస్..సారీ దామోదర్‌దాస్ మోడీకి వచ్చిన ఇబ్బందేమిటి అంటూ ఖేరా విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. మోడీ పేరులో దామోదర్‌దాస్ బదులుగా గౌతమ్ దాస్ అని తప్పుగా పలకడంపై బిజెపి భగ్గుమంది. ఇది ఉద్దేశపూర్వకంగానే ప్రధాని నరేంద్ర మోడీని అవమానించడమని ఆరోపిస్తూ బిజెపి నాయకులు అస్సాంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కూడా ఫిబ్రవరి 20న ఖేరా వ్యాఖ్యలను తప్పుట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)