ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) సోమవారం సభ వెలుపల వివిధ అంశాలపై నిరసనకు దిగింది. రైతాంగ సమస్యలు, శాంతిభద్రతలు, నిరుద్యోగం, ధరల మంట వంటి పలు అంశాలపై బీజేపీ సర్కార్ విధానాలను నిరసిస్తూ ఎస్పీ ఆందోళన చేపట్టింది. గవర్నర్ ఆనందిబెన్ పటేల్ సోమవారం అసెంబ్లీ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకాగా ఈనెల 22న ఆర్ధిక మంత్రి సురేష్ ఖన్నా బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఎస్పీ ప్రధాన కార్యదర్శి శివపాల్ సింగ్ యాదవ్ నేతృత్వంలో ఎస్పీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు చేబూని అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రజా సమస్యలను తాము సభలో లేవనెత్తేలా అసెంబ్లీ సమావేశాలను సజావుగా నిర్వహించాలని విలేకరులతో మాట్లాడుతూ యాదవ్ పేర్కొన్నారు. ఇన్వెస్టర్స్ సమ్మిట్లో నాటిన మొక్కలనే కాపాడలేని వారు పెట్టుబడులను ఎలా నిర్వహిస్తారని యోగి ఆదిత్యానాథ్ నేతృత్వంలోని కాషాయ సర్కార్పై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విరుచుకుపడ్డారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎదుట ఎస్పీ ధర్నా
February 20, 2023
0
Tags