కుక్కలను పెంచుకుంటే పన్ను !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్ లోని సాగర్‌ నగరం కొత్త చట్టం తీసుకురాబోతోంది. శునకాలను పెంచుకునే వారిపై పన్నులు విధించేందుకు సిద్ధమైంది. ప్రజల భద్రత, పరిశుభ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా సాగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ సమావేశంలో శునకాల ను పెంచుకునే యజమానులకు పన్ను విధించడంపై నిర్ణయం తీసుకున్నారు. 48 మంది కౌన్సిలర్లు దీన్ని ఏకగీవ్రంగా ఆమోదించారు. త్వరలోనే న్యాయ నిపుణులతో చర్చించి దీనిపై విధివిధానాలను రూపొందించనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి దీన్ని అమల్లోకి తీసుకురానున్నారు. ఈ మేరకు మున్సిపల్‌ కార్పొరేషన్ అధికారులు వివరాలు వెల్లడించారు. నగరంలో కుక్కల దాడి ఘటనలు పెరుగుతున్నాయని, బహిరంగ ప్రదేశాల్లోకి పెంపుడు శునకాలను తీసుకొచ్చి మలమూత్ర విసర్జన చేయించడం వల్ల పరిసరాలు అపరిశుభ్రం అవుతున్నాయని చెప్పారు. వీటిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. శునకాలకు రిజిస్ట్రేషన్‌, వ్యాక్సినేషన్‌, కుక్కలను పెంచుకునేవారికి పన్నులు విధిస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్‌ కార్పొరేషన్ సంస్థ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నగర వాసులు, జంతు ప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది తప్పుడు నిర్ణయమని, వీధి శునకాలపై అధికారులు చర్యలు తీసుకోవాలే తప్ప పెంపుడు శునకాలపై పన్నులు విధించడం ఏంటని ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)