అధికారులకు పంజాబ్‌ సీఎం వార్నింగ్‌

Telugu Lo Computer
0


తమ సహచర ఉద్యోగిని అరెస్టుకు నిరసనగా పంజాబ్‌ సివిల్‌ సర్వీస్‌ అధికారులు సామూహిక సెలవులకు పిలుపునివ్వడంపై ఆ రాష్ట్ర సీఎం భగవంత్‌ మాన్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మధ్యాహ్నం 2గంటల లోగా విధుల్లో చేరికపోతే వారందరినీ సస్పెండ్‌ చేస్తానని హెచ్చరించారు. దీంతో వారు దిగొచ్చారు. ఈ క్రమంలో సీఎం భగవంత్‌ మాన్‌ అదనపు ముఖ్య కార్యదర్శి ఎ.వేణు ప్రసాద్ ఉద్యోగులతో సమావేశం కావడంతో సామూహిక సెలవు పిలుపును ఉపసంహరించుకోవాలని పీసీఎస్‌ అధికారులు నిర్ణయించారు. అనంతరం వేణు ప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ వారంతా తక్షణమే విధుల్లో చేరతారని తెలిపారు. పీసీఎస్‌ అధికారుల సంఘం ప్రతినిధులతో సమావేశం సానుకూల వాతావరణంలో జరిగిందన్నారు. అనంతరం ఆ సంఘం అధ్యక్షుడు రజత్‌ ఒబేరాయ్‌ మాట్లాడుతూ సామూహిక సెలవు పిలుపును ఉపసంహరించుకోనున్నట్టు స్పష్టంచేశారు. లుథియానాలో ప్రాంతీయ రవాణా అధికారిగా పనిచేస్తోన్న నరీందర్‌ సింగ్‌ ధాలీవాల్‌ ట్రాన్స్‌పోర్టర్ల నుంచి లంచం తీసుకొని అక్రమ వాహనాలకు చలాన్లు వేయకుండా విడిచి పెడుతున్నారన్న ఆరోపణలపై విజిలెన్స్‌ అధికారులు ఆయన్ను శుక్రవారం అరెస్టు చేశారు. ఈ అరెస్టును పీసీఎస్‌ అధికారుల సంఘం తప్పుబడుతూ నిరసనకు పిలుపునిచ్చింది. ధాలీవాల్‌ను చట్టవిరుద్ధంగా ఏకపక్షంగా వ్యవహరించి అరెస్టు చేశారంటూ సోమవారం నుంచి ఐదు రోజుల పాటు మూకుమ్మడి సెలవులకు పిలుపునిచ్చింది. దీంతో ఉద్యోగుల తీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం మధ్యాహ్నం 2గంటల లోగా విధుల్లో హాజరుకాకపోతే సస్పెండ్‌ చేస్తామంటూ తీవ్రంగా హెచ్చరించారు. ఈ క్రమంలో సీఎం అదనపు ముఖ్య కార్యదర్శి ఎ. వేణుప్రసాద్‌ అధికారులతో సమావేశం కావడంతో వారు దిగొచ్చారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)