నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి ఇద్దరు మృతి !

Telugu Lo Computer
0


కర్ణాటకలోని బెంగళూరులో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ మంగళవారం ఉదయం ఒక్కసారిగా కుప్పకూలింది. ఔటర్ రింగ్ రోడ్డు నాగవర సమీపంలో జరిగిన ఈ విషాద ఘటనలో ఓ మహిళ, ఆమె కుమారుడు మృతి చెందారు. మరోవైపు ఈ ప్రమాదంలో మహిళ భర్త, కూతురు తీవ్రంగా గాయపడ్డారు. బైక్‌పై వెళ్తున్న కుటుంబ సభ్యులపై నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ పై నుంచి బరువైన ఐరన్ రాడ్ వారిపై పడింది. మంగళవారం ఉదయం తేజస్విని-లోహిత్ కుమార్ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటి నుంచి బైక్‌పై బయలుదేరారు. లోహిత్ తన భార్య తేజస్వినిని ఆఫీస్‌కు, పిల్లలను బేబీ సిట్టింగ్​కు తీసుకెళుతున్నాడు. నాగవర సమీపంలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ వద్దకు చేరుకోగానే నిర్మాణానికి ఉపయోగించే బరువైన ఐరన్ రాడ్ వారిపై పడింది. దీంతో దంపతులు, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 28 ఏళ్ల తేజస్విని, ఆమె మూడేళ్ల కుమారుడు విహాన్ చనిపోయారు. తేజస్విని భర్త లోహిత్, ఆమె కూతురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన జరిగిన సమయంలో తేజస్విని, లోహిత్ కుమార్ ఇద్దరూ హెల్మెట్లు ధరించి ఉన్నారని బెంగళూరు పోలీసులు తెలిపారు. ఇద్దరు పిల్లలు కవలలు అని కూడా చెప్పారు. ప్రమాదం జరిగిన తర్వాత దాదాపు 6 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)