ఆరుగురు సజీవ దహనం

Telugu Lo Computer
0


తెలంగాణలోని మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపల్లి వెంకటాపూర్‌లో శుక్రవారం అర్ధరాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం అయ్యారు. మరణించిన వారిలో ఇద్దరు బాలికలు ఉన్నారు. మందమర్రి పోలీసులు అందించిన వివరాల ప్రకారం రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఇంట్లో నుంచి మంటలు రావడం చూసి చుట్టుపక్కల స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఒక్కసారిగా మంటలు ఇల్లంతా వ్యాపించడంతో అందులో నిద్రిస్తున్న ఆరుగురు వ్యక్తులు మంటల్లో కాలిపోయారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. మృతుల్లో ఇంటి యజమాని మాసు శివయ్య, ఆయన భార్య పద్మ అలియాస్ రాజ్యలక్ష్మి, కూతురు వరుస అయ్యే సమీప బంధువు మౌనిక, ఆమె కూతుళ్లు హిమబిందు, స్వీటీ లతో పాటు శాంతయ్య అనే సింగరేణి కార్మికుడు ఉన్నారు. శివయ భార్య పద్మకు శాంతయ్యకు సంబంధం ఉన్నట్లు మందమర్రి ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ రావ్ తెలిపారు. 'తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదా బయటి నుంచి ఇంటికి ఎవరైనా నిప్పు పెట్టారా అనేది తేలాల్సి ఉంది. దర్యాప్తు కొనసాగుతోంది. గూనపెంకులు, కలపతో నిర్మించిన ఇల్లు కావడంతో మంటలు త్వరగా వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ లేదా ఇంట్లో దీపాల వల్ల మంటలు అంటుకున్నాయా అన్న కోణంలోనూ విచారిస్తున్నాం. ఇంటి యజమాని శివయ్య కు పాత పగలు లేవని ప్రాథమికంగా తేలింది. విచారణ కొనసాగుతోంది' అని మందమర్రి ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ రావ్ తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)