మనుస్మృతి దహనం కేసులో ముగ్గురు అరెస్టు

Telugu Lo Computer
0


హిందూ మతానికి చెందిన మనుస్మృతిని తగులబెట్టారనే ఆరోపణలపై ముగ్గురు వ్యక్తుల్ని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. వాస్తవానికి డిసెంబర్ -25వ తేదీని అంబేద్కరిస్టులు 'మనుస్మృతి దహన దినోత్సవం'గా జరుపుతుండడం చాలా కాలంగా ఆనవాయితీగా వస్తోంది. వర్ణ వ్యవస్థ పుట్టుకకు ప్రధాన కారణంగా తీవ్ర ఆరోపణలు ఉన్న మనుస్మృతిని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 1927లో నాగ్‭పూర్ ‭లో డిసెంబర్ 25న తగలబెట్టారు. దాన్ని అనుసరించి ఆ రోజున మనుస్మృతిని ప్రతి ఏడాది ఎక్కడో ఒక చోట తగలబెడుతూనే ఉంటారు. ఇందులో భాగంగా డిసెంబరు 25న బౌద్ధ మత దీక్షలో పాల్గొన్న అనంతరం రాజస్థాన్ ‭కు చెందిన వీరు ఈ గ్రంథాన్ని తగులబెట్టినట్లు హిందూ సంస్థలు ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సైతం చక్కర్లు కొట్టింది. దీన్ని ఆధారంగా చేసుకుని మనుస్మృతిని కాల్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయమై బామర్ అదనపు పోలీస్ సూపరింటెండెంట్ నర్పట్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ''డిసెంబరు 25న కొందరు వ్యక్తులు బౌద్ధ మత దీక్షలో పాల్గొన్నారు. అనంతరం మనుస్మృతిని తగులబెట్టారు. ఈ దీక్షా కార్యక్రమాన్ని భీమ్ సేన అనే సంస్థ నిర్వహించింది'' అని తెలిపారు. తమకు సమాచారం అందిన వెంటనే బకసర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని నర్పట్ తెలిపారు. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్లు 153ఏ (మతం, జాతి, జన్మస్థలం, నివాసం, భాష మొదలైనవాటి ఆధారంగా వేర్వేరు వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 295 (ప్రార్థనా స్థలాన్ని కానీ, పవిత్రమైన వస్తువును కానీ అపవిత్రం లేదా నాశనం లేదా ధ్వంసం చేసిన ఎవరైనా), 295ఏ మతాన్ని లేదా మత విశ్వాసాలను కించపరుస్తూ ఏదైనా మతస్థుల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశంతో చేసే పనులు), 298 (ఓ వ్యక్తికిగల మతపరమైన భావాలను గాయపరిచే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా ఏమైనా మాటలను ఉచ్చరించడం) ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)