ఎంఎల్ఏల ఎర్ర కేసులో స్టే ఎత్తివేత

Telugu Lo Computer
0


తెరాస ఎంఎల్‌ఏ ఎర కేసును మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేయొచ్చని తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తును నిలిపివేయాలంటూ గతంలో ఇచ్చిన స్టేను హైకోర్టు రద్దు చేసింది. ఎంఎల్‌ఏలకు ఎర కేసులో బిజెపి నేత ప్రేమేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై వాదనలు జరుగుతున్న సమయంలో మొయినాబాద్‌లో నమోదైన కేసుకు సంబంధించి దర్యాప్తుపై హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే విధించింది. సిబిఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో ఈ కేసు విచారణ జరిపించాలని ప్రేమేందర్ రెడ్డి తన పిటిషన్‌లో కోరారు. నేడు జరిగిన విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు నాడు ఇచ్చిన స్టేను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి కేసుల్లో ఎక్కువ రోజులు కాలయాపన చేయడం మంచిది కాదని వ్యాఖ్యానించింది. దీంతో ఇక దర్యాప్తును వేగవంతం చేయడానికి మొయినాబాద్ పోలీసులకు మార్గం సుగమం అయింది. కాగా సిబిఐ, లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరింపించాలన్న బిజెపి దాఖలు చేసిన పిటిషన్‌పై లోతైన విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. దర్యాప్తు పురోగతిపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. తెలంగాణ హైకోర్టు స్టే ఎత్తివేయడంతో ముగ్గురు నిందితులను పోలీసులు కస్టడీకి కోరే అవకాశముంది.

Post a Comment

0Comments

Post a Comment (0)