ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనాదారులకు తమిళనాడు ప్రభుత్వం చెవి మెలిపెడుతోంది. కొత్త మోటార్ వాహన చట్టం అమల్లోకి తెచ్చి భారీ మొత్తంలో అపరాధ రుసుములు వసూలు చేస్తున్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన మోటార్ వాహనచట్టం కింద నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులు 14 రోజుల్లో ఫైన్ చెల్లించకపోతే సదరు వాహనం వేలం వేయనున్నట్టు తమిళనాడు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడే వారి వాహనాన్ని స్వాధీనం చేసుకుని వేలం వేస్తామని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడే వాహనాలకు అపరాధ రుసుంగా రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపే వారికి రూ.1000 అపరాధం విధిస్తున్నారు. ఇతర ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు రూ.1000 నుంచి రూ.10,000 వరకు జరిమానా విధిస్తున్నారు. ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తొలి మూడు రోజుల్లోనూ 6,187 మందికి తమిళనాడు ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధించారు. వారి నుంచి రూ.42 లక్షల అపరాధ రుసుము వసూలు చేశారు. కొంతమంది వాహనదారులు ట్రాఫిక్ పోలీసులు విధించే ఫైన్ చెల్లించడం లేదు. దీంతో తమిళనాడు పోలీసుటు 12 కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి ఫైన్ కట్టని వాహనదారులకు ఫోన్ చేసి జరిమానా చెల్లించాలంటూ గుర్తుచేస్తున్నారు. ఏప్రిల్ 1నుంచి అక్టోబరు 10 వరకు ఆరు నెలల వ్యవధిలో 9,18,573 మంది వాహనదారుల నుంచి రూ.23,25,10,581 ఫైన్ వసూలు చేశారు. అయితే, మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే రెండు వారాల్లో అపరాధం రుసుం చెల్లించకపోతే ఆ వాహనాన్ని సీజ్ చేసి వేలం వేస్తామని నగర ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.
ఫైన్ చెల్లించకుంటే వాహనం వేలం
November 04, 2022
0
Tags