మేఘాలయలో ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడం రాజకీయంగా సంచలనం రేపింది. ఎన్పీపీ శాసనసభ్యులు ఫెర్లిన్ సంగ్మా, బెనెడిక్ మరాక్, టీఎంసీ ఎమ్మెల్యే షాంగ్ ప్లియాంగ్ లు మేఘాలయ అసెంబ్లీ స్పీకరుకు రాజీనామా పత్రాలు సమర్పించారు. రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు వచ్చే నెలలో బీజేపీలో చేరే అవకాశం ఉందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ముగ్గురు శాసనసభ్యులు స్పీకర్ మెత్బా లింగ్డోహ్కు రాజీనామా పత్రాలు దాఖలు చేశారని మేఘాలయ అసెంబ్లీ కార్యదర్శి ఆండ్రూ సైమన్స్ చెప్పారు. ముగ్గురు శాసనసభ్యులు తమ తమ పార్టీల సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్పీపీ నేతృత్వంలోని మేఘాలయ డెమోక్రటిక్ అలయన్స్లో మిత్రపక్షమైన బీజేపీలో ఈ నాయకులు వచ్చే నెలలో చేరవచ్చని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. రాజీనామా చేసిన నేతలను బీజేపీ నేత స్వాగతించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించే ఏకైక పార్టీ బీజేపీ అని ఎమ్మెల్యేలు గ్రహించారని బీజేపీ నేత అన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో మేఘాలయలో ఎన్నికలు జరగనున్నాయి.
మేఘాలయలో ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా
November 29, 2022
0
Tags