శిరోమణి అకాలీదళ్(ఏ) అధ్యక్షుడు, పంజాబ్ సంగ్రూర్ ఎంపీ సిమ్రన్ జిత్ సింగ్ మాన్ జమ్మూ కాశ్మీర్ పర్యటనను అధికారులు తిరస్కరించడంతో ఆయన మద్దతుదారులు ఖలిస్తాన్ మద్దతుగా నినాదాలు చేశారు. దీంతో సోమవారం రాత్రి కతువా జిల్లాలోని లఖన్ పూర్ లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. కాశ్మీర్ లోయలో శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉండటంతో జమ్మూ కాశ్మీర్ అధికారులు ఎంపి సిమ్రన్ జిత్ సింగ్ మాన్ ను కాశ్మీర్ లోకి ప్రవేశించడాన్ని అనుమతించలేదు. దీంతో ఆయన మద్దతుదారులు ఖలిస్తాన్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. కథువా జిల్లా మెజిస్ట్రేట్ రాహుల్ పాండే ఆదేశాల మేరకు మాన్ కాశ్మీర్ పర్యటనను అడ్డుకున్నారు. లఖన్ పూర్ లో 144 సెక్షన్ విధించారు. ఇదిలా ఉంటే తనను జమ్మూ కాశ్మీర్ లోకి ఎందుకు అనుమతించడం లేదో చెప్పాలని ఎంపీ సిమ్రన్ జిల్ సింగ్ కోరారు. భారతీయ జనతా పార్టీ తనను కావాలనే ఇబ్బంది పెడుతోందని.. నేను సిక్కు కావడంతోనే కాషాయపార్టీ, ఆర్ఎస్ఎస్ ఇలా తనను అడ్డుకుంటుందని వ్యాఖ్యానించారు. కాశ్మీర్లో సైనిక ప్రత్యేక అధికారాలకు మేం వ్యతిరేకం అని ఎంపీ అన్నారు. జమ్మూ కాశ్మీర్ సైనిక పాలనలో శాసనసభ లేదు, ప్రభుత్వం లేదని.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏం జరుగుతుందో స్వయంగా చూసేందుకు కాశ్మీర్ ప్రజలను సందర్శించేందుకు వచ్చానని.. బయటి ప్రపంచానికి నిజాలను తెలిపేందుకు కాశ్మీర్ పర్యటనకు వెళ్తున్నట్లు ఆయన అన్నారు. ఈ ఉద్రిక్తతల నడుమ లఖన్ పూర్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఖలిస్తాన్ కు అనుకూలంగా నినాదాలు చేసిన ఎంపీ అనుచరులు !
October 18, 2022
0
Tags