కర్ణాటక లోని కోలారు జిల్లా మాలూరు తాలూకాలోని టీకల్ ఫిర్కా కొమ్మనహళ్లి గ్రామం వద్ద మంజునాథ్కు చెందిన స్టోన్ క్రషర్లో గురువారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. బీహార్కు చెందిన కార్మికుడు రాకేష్ సాణి (34) దుర్మరణం పాలయ్యాడు. అయితే మాస్తి సీఐ వసంత్ రాత్రికి రాత్రే రాకేష్ సాణి మృతదేహాన్ని మాలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించి టిప్పర్ ఢీకొని మరణించినట్లుగా ప్రాథమిక నివేదికను సిద్ధం చేసినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. మృతుడి శరీరం కాలిపోయి ఉండడం పలు అనుమానాలకు తావిచ్చింది. శుక్రవారం ఉదయం కేంద్ర వలయ ఐజీపీ చంద్రశేఖర్, కోలారు ఎస్పీ దేవరాజ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఉన్నతాధికారుల దృష్టికి తేకుండా పోస్టుమార్టం ఎందుకు చేయించారనే ప్రశ్నలు తలెత్తాయి. ఘటనపై అనుమానాలు ఉన్న నేపథ్యంలో మాస్తి సీఐ వసంత్ను సస్పెండు చేశారు. మృతదేహాన్ని కోలారు జిల్లా ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం కోలారు జిల్లా ఆస్పత్రికి మంత్రి మునిరత్న వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ స్టోన్ క్రషర్ బ్లాస్ట్కు సంబంధించి పోలీసుల వైఖరి అనుమానాస్పదంగా ఉందని పేర్కొన్నారు. కార్మికుడి మృతదేహాన్ని బెంగుళూరు విక్టోరియా ఆస్పత్రికి పంపి రీ పోస్టుమార్టం చేయిస్తామన్నారు. మృతదేహాన్ని విక్టోరియా ఆస్పత్రికి తరలించాలని కలెక్టర్కు సూచించానన్నారు. పోలీసుల తప్పు కనిపిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.
స్టోన్ క్రషర్ పేలుడులో కార్మికుడు మృతి
October 15, 2022
0