తమిళనాడులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువతులు పోలీసుకొలువు సాధించి, శభాష్ అనిపించు కున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9,791 మంది పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఏడు నెలల శిక్షణ కాలం రెండు రోజుల క్రితం ముగిసింది. ఇందులో రాణిపేట జిల్లా కీల్ అవదం గ్రామానికి చెందిన అక్కచెల్లెళ్లు ప్రీతి, నిరంజని, వైష్ణవి ఒకేసారి పోలీస్ ఉద్యోగాలకు ఎంపికై, ఒకేచోట శిక్షణ పూర్తి చేశారు. ఈ సందర్భంగా వారి తండ్రి వెంకటేశన్ మాట్లాడుతూ తన భార్య షకీలా మృతి చెందినప్పటి నుంచి తన పిల్లలు ప్రీతి, నిరంజని, వైష్ణవి, కుమారుడు కార్తికేయన్ను సక్రమంగా చదివించి, ప్రభుత్వ ఉద్యోగంలో చేర్పించాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. తాను ఫ్లస్-2 పూర్తి చేశానని, అనంతరం పోలీస్ ఉద్యోగం కోసం ప్రయత్నించానన్నారు. అయితే పోలీసు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేక పోయానని, దీంతో తనకున్న ఐదు ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ తన పిల్లలను చదివించుకుంటున్నానని తెలిపారు. తన ముగ్గురు కుమార్తెలు డిగ్రీ పూర్తి చేశారని, కుమారుడు చెన్నైలో చదువుతున్నాడని చెప్పారు. పెద్ద కుమార్తె ప్రీతికి రాజీవ్గాంధీ అనే వ్యక్తితో వివాహం జరిగి, ఇద్దరు కుమారులున్నారని, తన మిగిలిన ఇద్దరు కుమార్తెలకు ఇంకా వివాహం కాలేదని తెలిపారు. అక్కాచెల్లెళ్లందరికీ ఒకేసారి పోలీసు ఉద్యోగం రావడం తనకు ఆనందంగా ఉందన్నారు. వారు ముగ్గురు కొన్నేళ్లుగా పోలీసు ఉద్యో గం కోసం వేచి ఉన్నారని, తనకు రాని పోలీస్ ఉద్యోగం తన కుమార్తెలకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ముగ్గురు కుమార్తెలు ప్రభుత్వ పాఠశాలలో విద్యను పూర్తి చేశారని, ముగ్గురు కుమార్తెలు ఇంట్లోనే చదివి పోలీస్ పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. తన ముగ్గురు కుమార్తెలు ఒకేసారి ఎంపికై ఒకే ప్రాంతంలో శిక్షణ పూర్తి చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ముగ్గురు కూతుళ్లకు పోలీసు ఉద్యోగాలు !
October 24, 2022
0