'మేడం.. నేను యువకుడిని కాను'

Telugu Lo Computer
0


ప్రపంచ వ్యాప్తంగా సుపరిచితమైన పేరు మిషెల్లీ ఒబామా. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్యగానే కాకుండా, వ్యక్తిగతంగా తనకంటూ ఒక గుర్తింపు ఉన్న మహిళ మిషెల్లీ. అయితే ఆమెపై బాలీవుడ్‌ ప్రముఖ గేయ రచయిత జావేద్‌ అఖ్తర్ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. తాను యువకుడిని కానని, 77 ఏళ్ల రచయితనంటూ చేసిన ట్వీట్ నెటిజెన్లను ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆయన చేసిన ట్వీట్ ఏంటంటే.. అమెరికా అధ్యక్ష బాధ్యతలోకి ఆమె రావాలని కోరారు. ప్రపంచం మొత్తం ఇదే కోరుకుంటోందని అన్నారు. ''మేడం.. నేను యువకుడ్ని కాదు. మీ అభిమానిగా సరదా కోసం ఈ ట్వీట్‌ చెయ్యడం లేదు. 77 ఏళ్ల రచయితను నేను. ప్రతి భారతీయుడికీ నా పేరు తెలుసు అనుకుంటున్నా. నా మాటలను సీరియస్‌గా తీసుకోండి. కేవలం అమెరికా మాత్రమే కాదు, మీరు శ్వేతసౌధంలో ఉండాలని యావత్‌ ప్రపంచం కోరుకుంటోంది. ఈ బాధ్యతను మీరు విస్మరించకూడదు.'' అంటూ మిషెల్లీ చేసిన ట్వీట్‌కు జావేద్ రిప్లై ఇచ్చారు. మిచెల్‌ ఒబామా తాను త్వరలో వెళ్లబోయే 'ది లైట్‌ వి కేరీ' అనే వినోదయాత్ర గురించి ట్వీట్‌ చేశారు. వాషింగ్టన్‌ డీసీ, ఫిలడేల్పియా, అట్లాంటా, చికాగో, శాన్‌ఫ్రాన్సిస్కో, లాస్‌ఏంజల్స్‌ నగరాల మీదుగా ఈ యాత్ర సాగనుంది. ఈ యాత్రలో భాగమయ్యేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ మిచెల్‌ ట్వీట్‌ చేశారు. దీనిపై స్పందించిన జావేద్‌ అక్తర్‌ ఆమెను శ్వేతసౌధానికి మళ్లీ వెళ్లాల్సిందిగా కోరారు. వరుసగా రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా ఎన్నికైన బరాక్‌ ఒబామా పదవీ కాలం పూర్తయిన తర్వాత జనవరి 2017లో శ్వేతసౌధాన్ని వీడారు.

Post a Comment

0Comments

Post a Comment (0)