భార్య బదులు అత్తను చంపాడు !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్ లోని బెతుల్ జిల్లాలోని సాయిఖేడా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మద్యానికి బానిస అయ్యి  భార్యను వేధించేవాడు. నిత్యం తాగి వచ్చి భార్యతో గొడవపడేవాడు. కొన్నాళ్లుగా అతడి వేధింపులను భరిస్తూనే అప్పుడప్పుడు ఎదిరించేది. అలా సర్దుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తుండేది. అయినా రోజు రోజుకు అతడి ఆగడాలు శృతిమించిపోయాయి. రాత్రి వేళల్లో తాగి వచ్చి ఆమెతో వాగ్వాదానికి దిగేవాడు. అలా ఆదివారం రాత్రి కూడా మరోసారి భార్యతో ఘర్షణకు దిగాడు. దీంతో విసుగు చెందిన అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కోపం పట్టలేని ఆ వ్యక్తి భార్యను చంపాలని అత్తారింటికి వెళ్లాడు. భార్యను తీసుకెళ్లడానికి వచ్చినట్లు అక్కడి వారిని నమ్మించాడు. ఈ క్రమంలో భార్యను చంపే ఉద్దేశంతో ఇనుముతో తయారు చేసిన ఆ ఇంటి ప్రధాన గేటుకు విద్యుత్ తీగతో కరెంట్ సప్లయ్ అయ్యేలా చేశాడు. ఆ సమయంలో అతడి భార్య బయటకి వెళ్లింది. అయితే అదే సమయంలో అతడి భార్య కు బదులు అత్త వచ్చి తెలియక ఆ గేటును తాకింది. దీంతో కరెంట్ షాక్ కొట్టి అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)