ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) తొమ్మిదో సీజన్ను ఆ జట్టు ఓటమితో మొదలెట్టింది. శుక్రవారం తన తొలి మ్యాచ్లో టైటాన్స్ 29-34 తేడాతో బెంగళూరు బుల్స్ చేతిలో ఓడింది. రైడింగ్లో మెరుగ్గానే రాణించిన టైటాన్స్.. ట్యాక్లింగ్లో విఫలమై పరాజయం మూటగట్టుకుంది. హోరాహోరీగా సాగిన పోరులో చివర్లో జట్టు వెనకబడింది. తొలి అర్ధభాగంలో మొదట ఆలౌటైన ఆ జట్టు ఆ తర్వాత పుంజుకుంది. ప్రత్యర్థిని ఓ సారి ఆలౌట్ చేసింది. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సరికి జట్లు 17-17తో నిలిచాయి. రెండో అర్ధభాగంలోనూ రెండు జట్లు పోటాపోటీగా తలపడ్డాయి. మరో తొమ్మిది నిమిషాలు ఆట మిగిలి ఉందనగా స్కోరు 23-23తో సమమైంది. కానీ అక్కడినుంచి ట్యాక్లింగ్లో టైటాన్స్ నిరాశపర్చింది. ప్రత్యర్థి ఆటగాళ్లను పట్టలేక పరాజయం చవిచూసింది. మరోసారి ఆలౌటై 25-30తో వెనకబడింది. ఆఖర్లో ప్రత్యర్థిని అందుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. టైటాన్స్ తరపున రైడింగ్లో వినయ్ (7 పాయింట్లు), రజ్నీష్ (7) రాణించారు. బెంగళూరు జట్టులో నీరజ్ (7) ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ మహేందర్ సింగ్ (4) ట్యాక్లింగ్లో సత్తాచాటాడు. అంతకుముందు సీజన్ ఆరంభ మ్యాచ్లో దబంగ్ దిల్లీ 41-27తో యు ముంబాను చిత్తుచేసింది. దిల్లీ కెప్టెన్ నవీన్ (13) రైడింగ్లో అదరగొట్టాడు. మరో మ్యాచ్లో యూపీ యోధాస్ 34-32తో జైపుర్ పింక్ పాంథర్స్పై గెలిచింది.
ప్రొ కబడ్డీ లీగ్లో టైటాన్స్ తొలి ఓటమి
October 08, 2022
0