ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వరంగ చమురు సంస్థలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. 2020 జూన్ నుంచి 2022 జూన్ వరకు వంటగ్యాస్ విక్రయాల్లో వచ్చిన నష్టాన్ని భర్తీ చేసేందుకు వీలుగా ఆయా సంస్థలకు పరిహారం ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా చమురు మార్కెటింగ్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలకు వన్టైం గ్రాంటు కింద రూ.22 వేల కోట్లు ఆర్థిక సాయం ఇవ్వనున్నట్టు ప్రకటించింది. గత రెండేళ్ల కాలంలో అంతర్జాతీయంగా వంటగ్యాస్ ధరలు దాదాపు 300 శాతం పెరిగినప్పటికీ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఈ మూడు సంస్థలు వినియోగదారులకు వంటగ్యాస్ సరఫరా చేసినట్టు తెలిపింది. అలాగే రైల్వే నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు ఉత్పత్తి ఆధారిత బోనస్ ప్రకటించింది. 78 రోజుల వేతనాన్ని బోనస్ను ఇస్తున్నట్టు ప్రకటించిన కేంద్రం ఇందు కోసం రూ.1832.09 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపింది. పీఎల్బీ చెల్లింపులకు గాను నెలకు రూ.7వేల చొప్పున లెక్కించి అర్హులైన 11.27లక్షల మంది ఉద్యోగులకు బోనస్గా ఇవ్వనున్నారు. దీంతో ఉద్యోగులకు గరిష్ఠంగా రూ.17,951 చొప్పున బోనస్గా వచ్చే అవకాశం ఉంది. ప్రయాణికులు, వస్తు రవాణా సేవలందించడంలో రైల్వే ఉద్యోగులు కీలక పాత్ర పోషించి ఆర్థిక వ్యవస్థకు ఉత్ప్రేరకంగా పనిచేశారని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశంసించారు. లాక్డౌన్ సమయంలోనూ ఆహారం, ఎరువులు, బొగ్గు, ఇతర నిత్యావసర వస్తువులను నిరంతరాయంగా తరలించేందుకు సహకరించారన్నారు. మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే, ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. 15వ ఆర్థిక సంఘం నాలుగేళ్ల కాలానికి ప్రత్యేక అభివృద్ధి పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
రైల్వే ఉద్యోగులకు ఉత్పత్తి ఆధారిత బోనస్ !
October 12, 2022
0
Tags