ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ డాక్టర్లు సమ్మెకు పిలుపునివ్వడంతో ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ల ఉపకార వేతనం (స్టైఫండ్) పెంచుతూ వైద్య ఆరోగ్య శాఖ జీవో జారీ చేసింది. పీజీ ఫస్టియర్ విద్యార్థులకు రూ. 44 వేల నుంచి రూ.50,686కు, సెకండియర్ విద్యార్థులకు రూ.46 వేల నుంచి రూ.53 వేలకు, థర్డ్ ఇయర్ విద్యార్థులకు రూ.48,973 నుంచి రూ.56,319కు, ఎంబీబీఎస్ విద్యార్థులకు రూ.19,589 నుంచి రూ.22,527కు స్టైఫండ్ పెంచింది. వివిధ క్యాటగిరీలు, చదువుతున్న సంవత్సరాలను బట్టి స్టైఫండ్లో పెంపుదల ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తమకు చెల్లించే స్టైఫండ్ను 42 శాతం పెంచాల్సిందేనని ఇటీవల జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని లేదంటే ఈ నెల 26 నుంచి ఔట్ పేషెంట్ సేవలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ నెల 25వ తేదీ వరకు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామని, 26 తేదీ నుంచి ఓపీ విధులకు హాజరుకాబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం అప్పటికీ స్పందించకుంటే 27వ తేదీ నుంచి అత్యవసర సేవలు తప్ప మిగతా వైద్య సేవలన్నీ బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి స్టైఫండ్ను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో జూనియర్ డాక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ పెంపు
October 21, 2022
0
Tags