మహారాష్ట్ర ప్రభుత్వం ఇకపై ఫోన్లో స్పందించేటప్పుడు ''హలో''కు బదులు ''వందేమాతరం'' అనాలని రూల్ తెచ్చింది. అయితే, ఆ రూల్ ప్రజల కోసం కాదు. ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల కోసం. ఈ మేరకు శనివారం జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆఫీసుకు వచ్చే వారిని కూడా వందే మాతరం అంటూ పలకరించాలని, వారికి దీనిపై అవగాహన కల్పించాలని కోరింది. హలోకు బదులు వందే మాతరం వాడటం వల్ల జాతీయ భక్తి కలుగుతుందని పేర్కొంది. ఈ ఆదేశాలు ప్రభుత్వం, సెమీ ప్రభుత్వం, స్థానిక సంస్థలు, ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలకు వర్తిస్తున్నాయి. అక్టోబర్ 2నుంచే అమల్లోకి వచ్చాయి. గతంలో సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగంటివర్ మాట్లాడుతూ.. '' హలో అనేది ఇంగ్లీష్ పదం. దాన్ని వదిలేయాల్సిన అవసరం ఉంది. కానీ, వందే మాతరం అనేది పదం కాదు. ప్రతి ఒక్క భారతీయుడు అనుభవించే భావోద్వేగం'' అని పేర్కొన్నాడు. ఆగస్టులో సుధిర్ ముంగంటివర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక, మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ కొత్త రూల్పై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మహారాష్ట్ర సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అబు అసిమ్ అజ్మి మాట్లాడుతూ.. '' ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదు. మేము వందే మాతరానికి బదులు ''సారే జహాన్ సే అచ్చ'' అంటాము. ముస్లింలు వందే మాతరం అనలేరు. అది వారి నమ్మకాలకు విరుద్ధం'' అని పేర్కొన్నారు.
''హలో''కు బదులు''వందేమాతరం'' ?
October 03, 2022
0
Tags