చిన్నారిపై అఘాయిత్యం కేసులో విస్తుపోయే నిజాలు !

Telugu Lo Computer
0


బంజారాహిల్స్‌లోని డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌లో చిన్నారి (4)పై ఇటీవల జరిగిన అఘాయిత్యం కన్నపేగును వణికించింది. తల్లిదండ్రులు సకాలంలో ఆమె ఇబ్బందిని గమనించటంతో నరరూప రాక్షసుడి నిజస్వరూపం వెలుగుచూసింది. తప్పును నివారించాల్సిన పాఠశాల ప్రిన్సిపల్‌ తల్లిదండ్రులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి పాఠశాల ప్రిన్సిపల్‌ ఎస్‌.మాధవి, డ్రైవర్‌ రజనీకుమార్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల దర్యాప్తులో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం, కారు డ్రైవర్‌ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బాధితుల్లో 10 నుంచి 15 మంది చిన్నారులు ఉండొచ్చని విశ్వసనీయ సమాచారం. పెత్తనమంతా డ్రైవర్‌దే: రజనీకుమార్‌ మొదటి భార్య నుంచి వేరుపడి రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికో కుమారుడు (10), కుమార్తె (2). కుమారుడు ఇదే పాఠశాలలో చదువుతున్నారు. డీఏవీ స్కూల్లో ఒక్కో తరగతిలో 50-52 మంది చిన్నారులున్నారు. ప్రిన్సిపల్‌ శివరాజు మాధవి వద్ద 11 ఏళ్లుగా బీమన రజనీకుమార్‌ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పేరుకే డ్రైవర్‌. ఉపాధ్యాయులకు సలహాలివ్వటం, బోధనాంశాల్లో జోక్యం చేసుకోవడం, ఫీజుల వసూళ్లు, పిల్లలకు శిక్ష విధించడం చేసేవాడని పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. అప్పటికప్పుడు పిల్లల్ని వేర్వేరు తరగతి గదుల్లోకి మార్చుతుండేవాడు. ఇతడి వింత ప్రవర్తన గమనించినా ప్రిన్సిపల్‌కి డ్రైవర్‌గా పనిచేస్తుండటంతో ఉపాధ్యాయులు మిన్నకుండేవారని తల్లిదండ్రులు చెబుతున్నారు. పాఠశాల ఆవరణలో ఇతడి కోసం ప్రత్యేకంగా డిజిటల్‌ గది కేటాయించారు. అందమైన చిన్నారులను ఎంచుకొని, అందులోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడేవాడని పోలీసుల దర్యాప్తులో నిర్ధారించారు. కెమెరాలకు చిక్కకుండా: నాలుగంతస్తుల పాఠశాల భవనం పూర్తిగా కనిపించేలా 14 కెమెరాలున్నాయి. వాటిలో మూడు పనిచేయడం లేదు. రజనీకుమార్‌కు ఇది తెలుసు. అందుకే వాటికి చిక్కకుండా బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. చాలా వాటిలో డ్రైవర్‌ బయట తిరుగుతున్నట్లు గుర్తించారు. మరోవైపు రజనీకుమార్‌ వ్యక్తిగత జీవితంపైనా ఆరా తీస్తున్నారు. ఇతనిపై గతంలో నల్గొండ జిల్లా పరిధిలో వరకట్న వేధింపుల కేసు నమోదైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇద్దరు నిందితులను వారం రోజులు కస్టడీకి కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. విద్యాలయాల్లో భద్రత చర్యలపై కమిటీ: ఎల్‌కేజీ చదివే చిన్నారిపై పాఠశాల ప్రిన్సిపాల్‌ కారు డ్రైవర్‌ లైంగిక వేధింపులకు పాల్పడిన నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌ గుర్తింపును తక్షణమే రద్దుచేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్‌ డీఈవోను ఆదేశించారు. అందులోని విద్యార్థులను సమీప పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని సూచించారు. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రుల సందేహాలను నివృత్తి చేసే బాధ్యత డీఈవోదేనని మంత్రి తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన భద్రతా చర్యలను సూచించేందుకు విద్యాశాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించారు. అందులో పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు, మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి, పోలీసు విభాగంలో మహిళల భద్రతను పర్యవేక్షిస్తున్న డీఐజీ స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఈ కమిటీ తన నివేదికను వారంలోగా అందిస్తుందని, అనంతరం విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసే బాధ్యతపై ఆయా పాఠశాలల యాజమాన్యాల నుంచి హామీపత్రం తీసుకునేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)