వచ్చే ఏడాది చంద్రయాన్-3

Telugu Lo Computer
0


జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగం విజయవంతమైంది. చంద్రయాన్ -3 ప్రయోగానికి దాదాపు అంతా సిద్ధమైందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ సోమ్ నాథ్ వెల్లడించారు. వచ్చే ఏడాది జూన్ లో రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తుది ఏర్పాట్లలో భాగంగా చిన్న చిన్న పరీక్షలు చేయాల్సి ఉందని ఆయన వివరించారు. వచ్చే ఏడాదిలో ఫిబ్రవరితో పాటు జూన్ లో రాకెట్ ప్రయోగానికి స్లాట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూన్ లోనే చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. జీఎస్ఎల్వీ మార్క్ 3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇస్రో చైర్మన్ మాట్లాడారు. చంద్రయాన్-2 తో పోలిస్తే చంద్రయాన్-3 మిషన్ ను మరింత అత్యాధునికంగా తీర్చిదిద్దినట్లు వివరించారు. 2019లో చేపట్టిన చంద్రయాన్-2 మిషన్ చివరి క్షణంలో ఫెయిల్ అయింది. చంద్రుడిపైన దిగే సమయంలో ల్యాండర్ తో సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే. ఈ ఫెయిల్యూర్ నేర్పిన పాఠాలతో చంద్రయాన్-3 మిషన్ ను తీర్చిదిద్దినట్లు సోమ్ నాథ్ తెలిపారు. శనివారం ప్రయోగించిన జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ విజయవంతంగా 36 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టిందని సోమ్ నాథ్ వివరించారు. నిజానికి చంద్రయాన్-3ని ఈ ఏడాది ఆగష్టులో ప్రయోగించాల్సి ఉంది. అయితే, కోవిడ్ వల్ల ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది. దీంతో వచ్చే ఏడాది జూన్‌లో చేపట్టేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఇస్రోకు సంబంధించిన ప్రాజెక్టుల వివరాల్ని సోమ్‌నాథ్ తాజాగా మీడియాకు వెల్లడించారు. ''చంద్రయాన్-2కు చంద్రయాన్-3 కి సంబంధం లేదు. ఇది కొత్త నమూనా. దీని నిర్మాణం చాలా కొత్తది. గతంలోలాగా సమస్యలు తలెత్తకుండా మరింత సమర్ధంగా దీన్ని తయారు చేస్తున్నాం'' అని ఆయన తెలిపారు. మరోవైపు భారతీయ వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపే గగన్ యాన్ ప్రాజెక్టుపై ఇస్రో పని చేస్తోందన్నారు. ఈ ప్రాజెక్టును 2024లో చేపడతామని చెప్పారు. దీనిలో భాగంగా తొలి అబార్ట్ మిషన్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలో నిర్వహిస్తామన్నారు. ఇక, ఇంతకుముందు 2019, సెప్టెంబర్‌లో చేపట్టిన చంద్రయాన్-2 విఫలమైన సంగతి తెలిసిందే. ల్యాండింగ్ ప్రక్రియ సరిగ్గా కాకపోవడంతో ఇది విఫలమైంది. అయితే, ఇది ఇప్పటికీ చంద్రుడిపై పని చేస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)