కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి, అశోక్ గెహ్లాట్ పోటీ నుంచి తప్పుకున్నారు. సోనియా గాంధీతో భేటీ అనంతరం బయటకు వచ్చిన ఆయన వివరాలను వెల్లడించారు. జరిగిన పరిణామాలపై అధిష్టానానికి క్షమాపణ చెప్పినట్లు ఆయన తెలిపారు. అంతేకాదు.. అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్-దిగ్విజయ్సింగ్ మధ్యే పోటీ ఉంటుందని గెహ్లాట్ ప్రకటించారు. అశోక్ గెహ్లాట్ అధిష్టానానికి ఇష్టుడిగా బరిలో దిగుతారని అంతా భావించారు. దీంతో ఏకగ్రీవంగా ఆయన ఎన్నిక కావొచ్చనే చర్చ నడిచింది. అయితే ఒక్క వ్యక్తి - ఒక్క పదవి కారణంతో ఆయన తనకు నచ్చిన వ్యక్తిని రాజస్థాన్ సీఎం చేయాలని భావించగా, సచిన్ పైలట్ పేరు తెర మీదకు రావడంతో ఎమ్మెల్యేల తిరుగుబాటు అక్కడి రాజకీయం కలకలం రేపింది. ఇది ఇలావుంటే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్న్టట్లు అధికారికంగా ప్రకటించారు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. తొలుత పోటీ విషయంలో ఊగిసలాట ప్రదర్శించిన ఆయన ఈరోజు నామినేషన్ ఫామ్లు తీసుకున్నారు. అనంతరం మీడియాకు ఆ విషయాన్ని తెలియజేశారు. మరో సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ ఇదివరకే నామినేషన్ పత్రాలను తీసుకున్న విషయం తెలిసిందే. నామినేషన్లు వేసేందుకు చివరి రోజైన సెప్టెంబర్ 30న ఈ ఇద్దరూ నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు స్పష్టమవుతోంది.
కాంగ్రెస్ అధ్యక్ష రేసు నుంచి గెహ్లాట్ అవుట్ !
September 29, 2022
0
Tags