విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సర్వం సిద్ధం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు సర్వం సిద్ధం చేసినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. భవన నిర్మాణానికి స్థల సేకరణ కూడా పూర్తయ్యిందని తెలిపారు. జోన్‌ ఏర్పాటుకు నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయని అన్నారు. రాజ్యసభలో సోమవారం కేంద్రీయ విశ్వ విద్యాలయాల చట్ట సవరణ బిల్లుపై జరిగిన చర్చలో భాగంగా వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై ఆడిగిన ప్రశ్నకు బదులిస్తూ రైల్వో జోన్‌ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్‌ను ఆమోదించినట్లు మంత్రి తెలిపారు. అంతకు ముందు బిల్లుపై ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ రైల్వేకు సంబంధించి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై రైల్వే మంత్రికి పలు సూచనలు, సలహాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా విశాఖ కేంద్రంగా ప్రకటించిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటును వేగవంతం చేయాలని కోరారు. రైల్వే మంత్రిత్వ శాఖ వద్ద మూడు సంవత్సరాలుగా డీపీఆర్‌ పెండింగ్‌లోనే ఉందని ఆయన పేర్కొన్నారు. భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ. 68 వేల కిలోమీటర్ల రైల్వే లైన్లు ఉన్నాయి. ప్రతి రోజు 21వేల ట్రైన్లు నడుస్తున్నాయి. దేశంలో 7,350 రైల్వే స్టేషన్ల నుండి ప్రతిరోజు 2.2 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని విజయసాయి రెడ్డి తెలిపారు. రోజుకు 30 లక్షల టన్నుల సరుకు రవాణా జరుగుతుందని తెలిపారు. ఇంతటి గొప్ప వ్యవస్థకు సారధ్యం వహిస్తున్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ఆయన అభినందించారు. విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని విజయసాయి రెడ్డి మంత్రిని కోరారు. దేశంలో మొత్తం 21 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లేదు. దీంతో ఉద్యోగార్ధులు రైల్వే పరీక్షల కోసం పక్క రాష్ట్రంలో సికింద్రాబాద్‌కు వెళ్లాల్సి వస్తుందని ఆయన అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)