రేపు భారత ఉప రాష్ట్రపతి ఎన్నికజరగనుంది. ఈ నేపథ్యంలో విపక్షాల అభ్యర్థిగా పోటీ చేస్తున్న మార్గరెట్ అల్వాకి మద్దతు ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థి మార్గరెట్ అల్వాకు టీఆర్ఎస్ మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఆమెకు 16 మంది టీఆర్ఎస్ ఎంపీలు ఓటు వేస్తారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిగా జగదీప్ ధన్కర్ పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. దేశంలోని పలు ప్రాంతీయ పార్టీలు జగదీప్ ధన్కర్కు మద్దతు ప్రకటించాయి. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి కూడా జగదీప్ ధన్కర్కు మద్దతు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వానికి, విపక్షాలకు మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇటీవలే రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరిగిందని, ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొందని ఈ సందర్భంగా ఆమె అన్నారు. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఉప రాష్ట్రపతి ఎన్నికలో జగదీప్ ధన్కర్కు మద్దతు తెలపాలని తమ పార్టీ బీఎస్పీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. రేపు సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఉదయం 10 నుంచి 5 గంటల వరకు ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరుగుతుంది. ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఆర్వోగా లోక్సభ సెక్రటరీ జనరల్ ఉంటారు. కొత్త ఉప రాష్ట్రపతిని 788 మంది లోక్ సభ, రాజ్యసభ సభ్యులు ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
మార్గరెట్ అల్వాకు టీఆర్ఎస్ మద్దతు
August 05, 2022
0
Tags