తెలంగాణ లోని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల బాలికల మైనార్టీ గురుకుల పాఠశాలలో పీఈటీ విద్యార్థినుల పట్ల పాఠశాల ఉపాధ్యాయులు దారుణంగా ప్రవర్తించారు. స్కూల్ విద్యార్థినులు నిన్న కొందరు జడలు వేసుకోకపోవడాన్ని గమనించిన పీఈటీ వారితో గుంజీలు తీయించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 200 వందలు గుంజీలు తీయించారు. దీంతో అమ్మాయిలంతా అస్వస్థతకు గురయ్యారు. కాళ్ల నొప్పులతో నడవడానికి ఇబ్బంది పడ్డారు. అస్వస్థతకు గురైన కొందరు విద్యార్థినులను ప్రిన్సిపల్ ఇంటికి పంపించారు. ఆ నేపథ్యంలో విషయం బయటకు పొక్కకుండా ఉపాధ్యాయులు తీవ్ర ప్రయత్నం చేశారు. సుమారు 50 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురికాగా కొందరికి జ్వరం రావడంతో అర్బన్హెల్త్ సెంటర్కు తీసుకువెళ్లి ప్రాథమిక చికిత్స చేయించగా, మరికొందరు విద్యార్థులను సిక్రూంలో తాళం వేసి బంధించారు. కొందరు విద్యార్థినులు నొప్పులు భరించలేక తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం కాస్తా బయటకు వచ్చింది. తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. పీఈటీపై చర్యలు తీసుకోవాలని ఆ బాలికల తల్లిదండ్రులు డిమాండ్ చేసారు. బుధవారం జరిగిన ఈ ఘటన తల్లిదండ్రుల ధర్నాతో నిన్న గురువారం బయటకు రావడంతో ప్రిన్సిపాల్ కల్పన చిన్న విషయమే..! అంటూ దాటవేసేందుకు యత్నించారు. అయితే గురుకులాల ఆర్ఎల్సీ జమీర్ అహ్మద్ విషయం తెలియడంతో.. పాఠశాలకు చేరుకుని పిల్లల పరిస్థితి చూస్తూ కూడా తాను కూడా చిన్న విషయం అనడం గమనార్హం. అయితే చివరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్న పీఈటీ శ్వేతను విధుల్లోంచి తొలగిస్తున్నట్లు జమీర్ అహ్మద్ పేర్కొన్నారు. పిల్లలు అస్వస్థకు గురైనా ఇంత జరిగినా.. ప్రిన్సిపాల్ కల్పనకు గురువారం సాయంత్రం వరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించలేక పోవడంతో తీవ్రంగా మండిపడ్డారు.
రెండు జడలు వేసుకోలేదని 200 గుంజీలు !
August 05, 2022
0
Tags