కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్తో కలిసి ఢిల్లీకి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం, పార్టీ పదవులకు దాసోజు శ్రవణ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయనతో బీజేపీ తెలంగాణ నేతలు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన బండి సంజయ్ పలువురు నేతలతో ఢిల్లీకి వెళ్ళారు. వారిలో దాసోజు శ్రవణ్ కూడా ఉన్నారు. శ్రవణ్ను బుజ్జగించేందుకు ఆయన నివాసానికి సీనియర్ నేతలు కోదండరెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్ వెళ్ళినా ప్రయోజనం లేకపోయింది. శ్రవణ్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. బీజేపీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 21న చేరతారని ఇప్పటికే బండి సంజయ్ ప్రకటించారు. ఆ రోజు మునుగోడులో జరిగే సభకు కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను బండి సంజయ్ ఆహ్వానించనున్నారు. అదే రోజున దాసోజు శ్రవణ్ సహా మరో ఆరుగురు నేతలు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. నేడు ప్రారంభమైన ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం బీజేపీ అగ్ర నేతలను బండి సంజయ్ కలుస్తారు. బీజేపీలో చేరికలతో పాటు మునుగోడు ఉప ఎన్నికపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిస్థితులను ఆయన వివరించే అవకాశం ఉంది.
బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్న దాసోజు శ్రవణ్ ?
August 06, 2022
0