సిద్ధూ మూసేవాలా హంతకుడు అరెస్టు

Telugu Lo Computer
0


పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో మరో ఇద్దరు నిందితులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. గత మే 29న సిద్ధూను దుండగులు కాల్చి చంపారు. ఈ హత్యకు పాల్పడ్డ గ్యాంగుకు చెందిన ఇద్దరు షూటర్లను తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరిలో ఒకరు అంకిత్ సిర్సా కాగా, మరొకరు అతడి అనుచరుడు సచిన్ బివాని. ఇద్దరిలో అంకిత్ సిర్సా వయసు 19 ఏళ్లే కావడం విశేషం. సిద్ధూ హత్యకు పాల్పడింది లారెన్స్ బిష్ణోయ్ అనే గ్యాంగ్‌స్టర్‌కు చెందిన గ్యాంగ్. గోల్డీ బ్రార్ అనే కెనడాకు చెందిన మరో గ్యాంగ్‌స్టర్ సూచనల మేరకు లారెన్స్ గ్యాంగ్ సభ్యులు ఈ హత్యకు పాల్పడ్డారు. ఈ కాల్పుల ఘటనలో పాల్గొన్న వారిలో అంకిత్ సిర్సా, సచిన్ బివాని ఉన్నారు. ఈ గ్యాంగు గతంలో కూడా పలు నేరాలు, హత్యలకు పాల్పడింది. హరియాణాలోని సోనిపట్‌కు చెందిన అంకిత్ నాలుగు నెలల క్రితమే లారెన్స్ గ్యాంగులో చేరాడు. అంకిత్ పాల్గొన్న తొలి హత్య సిద్ధూదే. కాగా, రాజస్థాన్‌లో జరిగిన మరో రెండు హత్యలతో అంకిత్ సిర్సాకు సంబంధాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. సిద్ధూ హత్య జరిగేటప్పుడు పక్కనే అంకిత్, ప్రియావ్రత్ ఫౌజీ అనే మరో గ్యాంగ్‌స్టర్ కారులో ఉన్నారు. వీరిద్దరూ పోలీసు దుస్తులు ధరించి, సిద్ధూ వాహనానికి కారు అడ్డుగా పెట్టారు. తర్వాత అంకిత్ దగ్గరి నుంచి సిద్ధూను కాల్చాడు. అనంతరం అక్కడి నుంచి ఇద్దరూ పారిపోయారు. అంకిత్‌, సచిన్ బివాని నుంచి పోలీసులు పిస్టల్, సిమ్ కార్డు, పోలీస్ యునిఫామ్ స్వాధీనం చేసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)