నౌక ప్రమాదంలో 12 మృత దేహాల వెలికితీత

Telugu Lo Computer
0


దక్షిణ చైనా సముద్రంలో శనివారం నౌక మునిగిన ప్రమాదంలో గల్లంతైన 30 మందిలో నేడు (సోమవారం) 12 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ మేరకు చైనా అధికారులు వెల్లడించారు. టైఫూన్ కారణంగా ఓ ఇంజినీరింగ్ నౌక హాంగ్ కాంగ్‌కు నైరుతి దిశలో 160 నాటికల్ మైళ్ల దూరంలో రెండు ముక్కలైంది. దీంతో ఈ నౌకలోని 30 మంది సిబ్బంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన విపత్తు స్పందన దళం సభ్యులు ముగ్గురిని కాపాడారు. మిగిలిన వారు సముద్రంలో కొట్టుకుపోయారు. ఈ నౌక ప్రమాదంలో చిక్కుకున్నట్లు హాంకాంగ్‌ విపత్తు స్పందన దళానికి శుక్రవారం రాత్రి సమాచారం అందింది. చాబా సెంటర్‌లో నౌక ఉన్నట్లు గుర్తించారు. విపరీతమైన గాలులు, కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉండటంతో సహాయక చర్యలు సంక్లిష్టమయ్యాయి. గంటకు 144 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు వాతావరణ శాఖ తెలిపింది. సముద్రంలోని తరంగాలు 10 మీటర్ల ఎత్తుకు ఎగసినట్లు పేర్కొంది. ప్రమాదంలో చిక్కుకున్న నౌకలోని సిబ్బందిని కాపాడటం కోసం హాంగ్ కాంగ్ గవర్నమెంట్ ఫ్లయింగ్ సర్వీస్ రెండు విమానాలను, నాలుగు హెలికాప్టర్లను పంపించింది. గాలింపు చర్యల్లో భాగంగా తాజాగా 12 మృతదేహాలను కనుగొన్నారు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)