టీఎస్‌ఆర్టీసీ లగేజీపై బాదుడు !

Telugu Lo Computer
0


ప్రయాణికుల టికెట్ చార్జీలు ఇటీవలే  పెంచిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ  ప్రయాణికుల లగేజీపై బాదుడుకు రంగం సిద్దమైంది. బస్సుల్లో తరలించే సామగ్రిపై విధించే లగేజీ చార్జీలను పెంచింది. కొత్త చార్జీలను ఈ నెల 22 నుంచే అమలులోకి తీసుకురావాలని నిర్ణయించింది. అంతేకాదు, సాధారణ ప్రయాణికులు మోసుకెళ్లే బ్యాగులు, వాటి బరువుపైనా కఠిన నిబంధనలు వచ్చాయి.  ఇప్పటికే సెస్‌ల రూపంలో టికెట్‌ ధరలను పెంచిన టీఎస్ఆర్టీసీ తాజాగా లగేజీ చార్జీల రూపంలో మోత మోగించనుంది. 50 కిలోల వరకు ఉచిత లగేజీకి అవకాశం ఇస్తున్నా ఇకపై అదనపు లగేజీ మరింత భారం కానుంది. 50 కిలోల బరువుకు అదనంగా ఒక కిలో పెరిగినా.. పాతిక కేజీల వరకు ఒక యూనిట్‌గా పరిగణించి పూర్తి చార్జీని వసూలు చేయనున్నారు. అలాగే, ప్రయాణికుడు ఉచితంగా తీసుకెళ్లే 50 కిలోల బరువు కూడా మూడు ప్యాకెట్ల (బ్యాగులు, సూట్‌కేసులు వగైరా)కు మించి ఉండకూడదు. ప్రతి ప్యాకెట్‌ 20 కిలోల బరువు మించి ఉండకూడదు. ఒకవేళ ఉచిత పరిమితిలోపు ఉండే బరువు మూడు ప్యాక్‌లకు మించితే అదనపు ప్యాక్‌లపై చార్జీ విధిస్తారు.  రైతులు, చిరు వ్యాపారులు పల్లె వెలుగు బస్సుల్లో ఉదయం పూట పంటలు, పూలూ, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకెళుతుండటం తెలిసిందే. పల్లె వెలుగు బస్సులోన్న ఇన్నాళ్లూ (25 కి.మీ. దూరానికి) 50కేజీల బరువుకు లగేజీ టికెట్ రూ.1 ఉండేది. దాన్నిప్పుడు ఏకంగా రూ.20కి పెంచారు. ఎక్స్‌ప్రెస్, ఆపై కేటగిరీ బస్సుల్లో ఇదే దూరానికి ఉన్న రూ.2 చార్జీని రూ.50కి పెంచింది. సిటీ బస్సుల్ని కూడా వదలకుండా పాత చార్జీలతో పోల్చుకుంటే పెద్ద మొత్తంలో చార్జీలు వసూలు చేయనుంది. సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో ఒక్కో ప్రయాణికులు తమ వెంట 50 కిలోల బరువుండే సామగ్రిని ఉచితంగా తీసుకెళ్లొచ్చు. అంతకంటే మించి ఉండే సామగ్రిపై చార్జీలు విధిస్తారు. 25 కిలోల వరకు బరువును ఓ యూనిట్‌గా పరిగణిస్తారు. అంటే ఉచిత పరిమితికి మించి ఒక కిలో ఎక్కువున్నా సరే, దాన్ని ఒక యూనిట్‌గానే పరిగణించి చార్జీ వడ్డిస్తారు. ఆర్టీసీ బస్సుల్లో ఇప్పుడు వసూలు చేస్తోన్న లగేజీ చార్జీలు 2002లో ఖరారు చేసినవే. గత 20 ఏళ్లలో ఎన్నోసార్లు సాధారణ ప్రయాణికుల టికెట్‌ చార్జీలు పెరిగినా లగేజీ చార్జీలను మాత్రం సవరించలేదు. అయితే ఇప్పుడు ఇంధన ధరలు చుక్కల్లో చేరడం, ఇటీవల నష్టాలను పూడ్చుకునేందుకు డీజిల్‌ సెస్‌ విధింపు, ఆ వెంటనే దాని సవరింపుతో టికెట్‌ రూపంలో ఆదాయాన్ని భారీగా పెంచుకున్న ఆర్టీసీ..తాజాగా లగేజీ చార్జీలను పెంచడంతో పాటు పకడ్బందీగా వసూలు చేయాలని నిర్ణయించింది. ప్రయాణికుల బస్సుల్లో లగేజీ చార్జీలను ఆర్టీసీ సరుకు రవాణా (కార్గో) చార్జీలకు దాదాపు సమంగా పెంచేసింది. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్‌ బస్సుల్లో ఒక్కో ప్రయాణికుడు లేదా ప్రయాణికురాలు పెరిగిన లగేజ్ టికెట్ చెల్లించి గరిష్టంగా 750 కిలోల బరువును తీసుకెళ్లొచ్చు. అదే సూపర్‌ లగ్జరీ బస్సులోనైతే బరువు పరిమితి 1,000 కిలోలుగా ఉంది. అలాగే సాధారణ ప్రయాణికులు ఒక్కోక్కరు వంద కిలోలకు మించిన బరువును తీసుకెళ్లరాదని, వంద కిలోల్లో 50 ఉచితం కాగా, మిగతాది చార్జీ పరిధిలోకి వస్తుందని సంస్థ పేర్కొంది. చార్జీ విధించే 50 కిలోల బరువు రెండు ప్యాకెట్లలో మాత్రమే ఉండాలి. మూడో ప్యాక్‌ ఉంటే దాన్ని అదనపు యూనిట్‌గా భావించి అదనపు చార్జీ విధిస్తారు. 100 కిలోలకు మించి బరువు ఉంటే ప్రయాణికుల బస్సుల్లో అనుమతించరు. కార్గో బస్సుల్లోనే తరలించాలి. బస్సుల్లో నిషేధిత వస్తువులు, అగ్ని ప్రమాదాలకు కారణమయ్యేవి, అటవీ సంబంధిత వస్తువులు, పెంపుడు జంతువులు సహా ఏ జంతువులనూ అనుమతించరు. 

Post a Comment

0Comments

Post a Comment (0)