ఆయిల్పాం గెలలు పామాయిల్ పరిశ్రమలకు పోటెత్తాయి. నెలాఖరు కావడంతో అశ్వారావుపేట, అప్పారావుపేట పరిశ్రమలకు రెండు రోజులుగా గెలల ట్రాక్టర్లు భారీగా బారులుదీరాయి. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ధరలు తగ్గుతాయనే ప్రచారంతో రైతులు తోటల్లో గెలలను ముందుగానే నరికి పరిశ్రమకు తరలించే పనిలో ఉన్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు అశ్వారావుపేట పామాయిల్ పరిశ్రమలో 1,500 టన్నులు, అప్పారావుపేట పరిశ్రమలో 1,800 టన్నుల గెలలు నిల్వలున్నాయి. వాటికి అదనంగా రెండు కిలోమీటర్ల మేర ట్రాక్టర్లు బారులుదీరాయి. అశ్వారావుపేటలో పరిశ్రమ నుంచి కిలోమీటరు దూరం ప్రధాన గేటు వరకూ, అక్కడి నుంచి ఖమ్మం మార్గంలో జాతీయ రహదారిపై మరో కిలోమీటరు వరకూ వాహనాలు ఆగి ఉన్నాయి. దీంతో ఒక్కొక్కటిగా వాహనాన్ని తనిఖీ చేసి ఆంధ్రప్రదేశ్ గెలలుంటే వెనక్కి పంపుతూ తెలంగాణకు చెందిన వాహనాలను లోపలకు అనుమతిస్తున్నారు. వందలాది వాహనాలు ఒకేసారి రావడంతో గెలలు దించేందుకు కూడా స్థలం సరిపోని పరిస్థితి నెలకొంది. ఉదయం వచ్చిన వాహనం సాయంత్రం వరకూ దిగుమతి కోసం ఎదురు చూడాల్సి వస్తోంది.
పరిశ్రమలకు వందలాది ఆయిల్పాం వాహనాలు !
July 31, 2022
0
Tags