పిల్లల ఇంటి పేర్లు తల్లుల ఇష్టం !

Telugu Lo Computer
0


తల్లులకు తమ పిల్లల ఇంటిపేర్లు నిర్ణయించుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పిల్లలకు తల్లి తప్ప మరో సహజమైన సంరక్షకులు లేనప్పుడు, తండ్రి మరణించినప్పుడు పిల్లల ఇంటిపేరును నిర్ణయించే హక్కు తల్లికి ఉంటుందని కోర్టు తీర్పునిచ్చింది. జస్టిస్ దినేష్ మహేశ్వరి, క్రిష్ణ మురారితో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ మేరకు గురువారం తీర్పు వెలువరించింది. 2006లో ఒక మహిళ భర్త చనిపోయాడు. అప్పటికే ఆమెకు రెండున్నర సంవత్సరాల వయసున్న బాబు ఉన్నాడు. ఆ మహిళ 2007లో మరో పెళ్లి చేసుకుంది. బాబు తనతోనే ఉంటున్నాడు. అయితే, బాబు తన తల్లితోనే ఉన్నప్పటికీ అతడి ఇంటిపేరుగా తమ ఇంటి పేరే వాడుకోవాలని, తండ్రిపేరు స్థానంలో తన కొడుకు పేరే ఉండాలని కోరుతూ మరణించిన భర్త తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2014లో వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పు ప్రకారం.. బాబుకు మరణించిన తండ్రి ఇంటిపేరే ఉండటంతోపాటు, తండ్రి పేరు స్థానంలో కూడా అతడి పేరు పెట్టుకోవాలని సూచించింది. ఒకవేళ అవసరమనుకుంటే మహిళ తన రెండో భర్త పేరును బాబుకు దత్తత తండ్రిగా పెట్టుకోవచ్చని సూచించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు సరికాదని వ్యాఖ్యానించింది. తండ్రి పేరుతోపాటు, దత్తత తీసుకున్న మరో తండ్రి పేరు ఉంచుకోవడం క్రూరమైన చర్యగా వర్ణించింది. దీనివల్ల బాబు అనేక మానసిక సమస్యలు, ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందని అభిప్రాయపడింది. పిల్లలకు తల్లి తప్ప మరో సహజ సంరక్షకులు లేని సందర్భంలో, పిల్లల ఇంటిపేరును తల్లే నిర్ణయించుకోవచ్చని సూచించింది. అలాగే పిల్లల్ని దత్తత ఇచ్చే హక్కు కూడా తల్లికి ఉంటుందని చెప్పింది. 2019లో ఆ మహిళ, తన కొడుకును రెండో భర్తకు చట్టప్రకారం దత్తత కూడా ఇచ్చింది. దీని ప్రకారం అతడికే తండ్రిగా అన్ని హక్కులు ఉంటాయి. తల్లిదండ్రులుగా ఆ ఇద్దరికి పూర్తి బాధ్యత ఉంటుంది. అలాగే ఆ కుటుంబంలో జన్మించిన వారికి ఏ హక్కులు ఉంటాయో.. అవే హక్కులు దత్తత ద్వారా వచ్చిన పిల్లలకు కూడా ఉంటాయని కోర్టు సూచించింది.


Post a Comment

0Comments

Post a Comment (0)