ఎల్ అండ్ టీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- జూన్లో రూ.1702.07 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదుచేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసిక లాభం రూ.1174.44 కోట్లతో పోలిస్తే ఇది 44.9 శాతం ఎక్కువ. మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.29,334.73 కోట్ల నుంచి రూ.35,853.20 కోట్లకు వృద్ధి చెందింది. ఈపీసీ కంపెనీలకు మొదటి త్రైమాసికం అత్యుత్తమంగా ఉంటుందని, ఏప్రిల్-జూన్లో ఎల్ అండ్ టీ బలమైన పనితీరు నమోదుచేసిందని కంపెనీ పూర్తిస్థాయి డైరెక్టర్, సీఎఫ్ఓ ఆర్.శంకర్ రామన్ తెలిపారు. ఈ త్రైమాసికం నుంచి 9కి బదులు ఏడు విభాగాలుగా కంపెనీ ఫలితాలు ప్రకటిస్తుందని అన్నారు. సమీక్షిస్తున్న త్రైమాసికంలో కంపెనీ రూ.41,805 కోట్ల ఆర్డర్లు దక్కించుకుంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇవి 57 శాతం అధికం. మౌలిక విభాగ ఆర్డర్లు 66 శాతం వృద్ధితో రూ.18,343 కోట్లకు చేరాయి. ఇంధన ప్రాజెక్ట్ విభాగం రూ.4,366 కోట్ల ఆర్డర్లు పొందింది. జూన్ ఆఖరుకు కంపెనీ ఏకీకృత ఆర్డరు పుస్తకం విలువ రూ.3,63,448 కోట్లుగా ఉంది.
రూ.1702 కోట్లు లాభానార్జించిన ఎల్ అండ్ టీ
July 27, 2022
0
Tags