సురక్షిత ఆహారం-మెరుగైన ఆరోగ్యం

Telugu Lo Computer
0


జూన్ 7న ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి  నిర్వహిస్తోంది. ఆహార భద్రత-పౌష్టికాహార ప్రాధాన్యం, కలుషిత ఆహారం, నీరుతో కలిగే అనారోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ప్రపంచ సురక్షిత ఆహార దినోత్సవం ప్రధాన ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్ కారణంగా ప్రజలు అనారోగ్యం బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ద్వారా శుభ్రమైన, సురక్షితమైన ఆహారపు ప్రాధాన్యతపై ఐరాస ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. మానవ ఆరోగ్యానికి, ఆర్థిక శ్రేయస్సుకు, సుస్థిర అభివృద్ధికి,వ్యవసాయ అభివృద్ధి, పర్యాటక రంగానికి సురక్షిత ఆహారం, ఆహార భద్రత ఎంత ముఖ్యమైనదో ప్రజలకు తెలియజేస్తోంది. ఈసారి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని 'సురక్షిత ఆహారం-మెరుగైన ఆరోగ్యం' అనే థీమ్‌తో నిర్వహిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. మానవ ఆరోగ్యానికి సురక్షిత ఆహారమే ప్రధానమైనదని ఈ థీమ్ ద్వారా తెలియజేస్తున్నారు. డబ్ల్యూహెచ్ఓ 2019 రిపోర్ట్ ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏటా కలుషిత ఆహారం కారణంగా 600 మిలియన్ల ప్రజలు అనారోగ్యం బారినపడుతున్నారు. అంటే... ప్రపంచంలో ప్రతీ 10 మందిలో ఒకరు కలుషిత ఆహార బాధితులుగా మారుతున్నారు. పిల్లల్లో ఇది మరింత ఎక్కువగా ఉంది. ఏటా ఐదేళ్ల లోపు పిల్లలైన 1,25,000 మంది కలుషిత ఆహారం కారణంగా మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని నిర్వహించాలని డిసెంబర్, 2018లో ఐరాస జనరల్ అసెంబ్లీ నిర్ణయించింది. జూన్ 7, 2019 నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం రోజున డబ్ల్యూహెచ్ఓ అధికారిక వెబ్‌సైట్ వేదికగా ఆహార భద్రతపై పలు చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సురక్షిత, శుభ్రమైన ఆహారాన్ని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, కలుషిత ఆహారం ద్వారా కలిగే అనారోగ్యం తదితర అంశాలపై ఇందులో చర్చిస్తారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)