గౌరవం లేని చోట ఉండలేక రాజీనామా

Telugu Lo Computer
0


తెలుగుదేశం పార్టీలో ఏడాది నుంచి నాకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు.. కనీసం గౌరవం కూడా ఇవ్వడం లేదు. గౌరవం లేనిచోట నేను ఉండలేకనే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్న అంటూ దివ్య వాణి అన్నారు. రెండు రోజుల క్రితం టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆమె ట్విటర్ లో పోస్టు చేశారు. కొద్దిగంటల్లోనే మళ్లీ దానిని డిలీట్ చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు వార్తల నేపథ్యంలోనే తాను రాజీనామా చేశానని, అలాంటిదేమీ లేదంటూ వ్యాఖ్యానించారు. బుధవారం దివ్యవాణి టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. అంతా సర్దుకుంటుందని టీడీపీ శ్రేణులు భావించినప్పటికీ బాబుతో భేటీ అనంతరం ఆమె పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నాకు గతేడాది కాలంగా పార్టీలో ప్రాధాన్యత లేదని, కనీస మర్యాదకూడా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మీడియా ఎదుటనే దివ్యవాణి కన్నీరు పెట్టుకున్నారు. చంద్రబాబు నాకు తండ్రిలాంటి వారని, చంద్రబాబును ఉద్దేశించి నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని అన్నారు. నా బాధను మీడియాతో పంచుకోవడమే నేను చేసిన తప్పా అంటూ ఆమె ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు లాగా పార్టీ లేదు బొక్కా లేదు అని నేను అన్నానా.. నేనేదో అన్నానని నన్ను తప్పు పట్టిన వాళ్లు.. పార్టీ లేదు బొక్కా లేదన్న అచ్చెన్నని ఏం శిక్షించారు అంటూ దివ్య వాణి ప్రశ్నించారు. సాధినేని యామిని లాగా నేనేం విమర్శలు చేయలేదని అన్నారు. నాలాగా పార్టీలో ఇబ్బందులు పడేవారు చాలా మంది ఉన్నారని, కానీ వాళ్లకు పదవులు అవసరం కాబట్టి డాగ్స్ లా ఉంటున్నారని దివ్యవాణి విమర్శించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)